వైభవంగా రేణుక ఎల్లమ్మ కల్యాణోత్సవం..
వైభవంగా రేణుక ఎల్లమ్మ కల్యాణోత్సవం..
NM Yadav
పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి..
ఆలయ అభివృద్ధికి సర్వశక్తులా కృషి చేస్తాం..
కనగల్ : నల్గొండ జిల్లా కనగల్ మండలం ధరవేశిపురంలో వెలిసిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి బ్రహ్మోత్సవాలు కన్నులపండువగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా బుధవారం నిర్వహించిన శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు, జమదగ్ని మహర్షుల దివ్య కల్యాణ మహోత్సవంలో రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు, ఆలయం నుండి కల్యాణ మండపం వరకు మంగళవాయిద్యాలు, మేళతాళాల నడుమ మంత్రి కోమటిరెడ్డి ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, కల్యాణ వేడుకను తిలకించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు. జిల్లాతో పాటు రాష్ట్ర ప్రజలంతా ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని అమ్మవారిని వేడుకున్నట్లు తెలిపారు. బ్రహ్మోత్సవాలకు పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులకు ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ధరవేశిపురం రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని అన్ని రకాలుగా సుందరీకరించి, భక్తులకు మెరుగైన వసతులు కల్పించేలా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని మంత్రి భరోసా ఇచ్చారు. అమ్మవారిని దర్శించుకున్న వారిలో కనగల్ తహసిల్దార్ పద్మ, ఎంపీడీవో వేద రక్షిత, ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ వెంకట్ రెడ్డి, ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈవో) నాగిరెడ్డి, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి