ప్రజల్లో ఉంటేనే నాయకుడిగా గుర్తింపు: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
ప్రజల్లో ఉంటేనే నాయకుడిగా గుర్తింపు: ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి
K.RAVI
* చౌటుప్పల్ మండల, పట్టణ అధ్యక్షుల ప్రమాణ స్వీకారోత్సవం
* నియోజకవర్గ అభివృద్ధిలో రాజీపడే ప్రసక్తే లేదు
నాయకుడనే వాడు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి కష్టసుఖాలను వింటూ, వారిని గౌరవించినప్పుడే ప్రజల్లో నిజమైన నాయకుడిగా మనగలుగుతాడని మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి అన్నారు. చౌటుప్పల్ పట్టణంలోని ఆయన వ్యక్తిగత క్యాంపు కార్యాలయంలో బుధవారం నిర్వహించిన నూతన మండల, పట్టణ అధ్యక్షుల ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. నూతనంగా ఎన్నికైన చౌటుప్పల్ మండల అధ్యక్షుడు బోయ దేవేందర్, చౌటుప్పల్ పట్టణ అధ్యక్షుడు కాసర్ల శ్రీనివాస్ రెడ్డి చేత ప్రమాణ స్వీకారం చేయించి, వారిని శాలువాలతో ఘనంగా సత్కరించి అభినందించారు.ఈ సందర్భంగా రాజగోపాల్రెడ్డి మాట్లాడుతూ.. రాజకీయాల్లో గెలుపోటములు సహజమని, ఓడినా గెలిచినా ప్రజల మధ్యనే ఉంటూ ఆపదలో ఆదుకునే వారికే ప్రజలు అండగా ఉంటారని స్పష్టం చేశారు.గ్రామ, మండల, పట్టణ, నియోజకవర్గ స్థాయిలో నాయకులంతా కలిసికట్టుగా పనిచేస్తేనే ఆశించిన ఫలితాలు వస్తాయి. 2018 ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా టీఆర్ఎస్ హవా నడిచినా, మునుగోడులో మాత్రం కార్యకర్తల కష్టం, ప్రజల ఆదరణతో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరింది.రాజకీయాల్లో ఉండేవారు ఓపికతో పనులు చేసుకుంటూ పోతే భవిష్యత్తులో ఖచ్చితంగా పదవులు వస్తాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు. నాయకుడి వ్యక్తిత్వం ఎలాంటిది, ప్రజలకు అందుబాటులో ఉంటున్నాడా లేదా, ప్రజలకు మంచి పనులు చేస్తున్నాడా లేదా అని జనాలు సునిశితంగా గమనిస్తుంటారని హెచ్చరించారు. గెలిచిన తర్వాత ప్రవర్తనలో మార్పు వస్తే వచ్చే ఎన్నికల్లో ప్రజల తీర్పు వ్యతిరేకంగా ఉంటుందని గుర్తుచేశారు. నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు అందరినీ సమన్వయం చేసుకుంటూ, పార్టీని మరింత బలోపేతం చేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. తాను ప్రతిపక్షంలో ఉన్నా, అధికార పక్షంలో ఉన్నా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో మాత్రం ఎప్పుడూ రాజీపడలేదని, మున్ముందు కూడా పడనని స్పష్టం చేశారు.
తమపై నమ్మకంతో చౌటుప్పల్ మండల, పట్టణ అధ్యక్షులుగా బాధ్యతలు అప్పగించినందుకు బోయ దేవేందర్, కాసర్ల శ్రీనివాస్ రెడ్డిలు ఎమ్మెల్యే రాజగోపాల్రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ శాలువాతో ఘనంగా సత్కరించారు. పార్టీ బలోపేతానికి, నియోజకవర్గ అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మండల, మున్సిపల్ పరిధిలోని ముఖ్య నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి