ఉర్సు వేడుకల నేపథ్యంలో మౌలాలిలో పారిశుధ్య ఏర్పాట్లపై కమిషనర్ ఆకస్మిక తనిఖీ
ఉర్సు వేడుకల నేపథ్యంలో మౌలాలిలో పారిశుధ్య ఏర్పాట్లపై కమిషనర్ ఆకస్మిక తనిఖీ
స్థానికం బృందం
ఉర్సు వేడుకల ముందు పారిశుధ్యంపై కమిషనర్ స్పెషల్ ఫోకస్
స్థానిక ప్రతినిధి
మౌలాలి దర్గా ఉర్సు ఉత్సవాల నిర్వహణలో పారిశుధ్యానికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని మల్కాజిగిరి జోన్ కమిషనర్ సంచిత్ గంగ్వార్ స్పష్టం చేశారు. సోమవారం ఉదయం 6 గంటల నుంచే ఆయన పారిశుధ్య పర్యవేక్షణలో భాగంగా విస్తృతంగా పర్యటించారు.
లాలాపేట్ ఫ్లైఓవర్తో పాటు మౌలాలి హజరత్ అలీ అబిన్ కోయి దర్గా పరిసరాలను కమిషనర్ పరిశీలించారు. దర్గా పుట్టినరోజు, ఉర్సు ఉత్సవాల సందర్భంగా భక్తులు, యాత్రికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మూడు షిఫ్టులుగా పారిశుధ్య పనులు నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. కొండపై చెత్త వేయకుండా చర్యలు తీసుకోవాలని, అవసరమైన చోట్ల డస్ట్బిన్లు ఏర్పాటు చేయాలని, తాత్కాలిక మూత్రశాలలు ఏర్పాటు చేయాలని సూచించారు.
అనంతరం నేరేడ్మెట్లోని ఎఫ్ఓబి (ఫుట్ ఓవర్ బ్రిడ్జ్)ను తనిఖీ చేశారు. అక్కడ పారిశుధ్య లోపాలు ఉన్నట్లు గుర్తించిన కమిషనర్ ప్రతిరోజూ తప్పనిసరిగా శుభ్రత పనులు చేపట్టాలని ఆదేశించారు. రాత్రి వేళల్లో అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా ప్రత్యేక సిబ్బందిని నియమించాలని సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్కు సూచించారు.
లాలాపేట్ ఫ్లైఓవర్ బ్రిడ్జి తనిఖీలో భాగంగా సెంట్రల్ డివైడర్పై రాళ్లు, మట్టి కుప్పలు, పిచ్చి మొక్కలు ఉండరాదని స్పష్టం చేశారు. గ్రీన్ వేస్ట్ను వెంటనే తొలగించాలని అధికారులను ఆదేశించారు. అలాగే వాయుపురిలోని చెత్త ట్రాన్స్ఫర్ స్టేషన్ పనితీరును పరిశీలించి, రోజువారీ చెత్త నిల్వలు లేకుండా వెంటనే జోహార్నగర్కు తరలించాలని సూచించారు.
ఈ పర్యటనలో జోనల్ కమిషనర్తో పాటు డిప్యూటీ కమిషనర్ గోపాల్రావు, ఈఈ లక్ష్మణ్, సర్కిల్ ఉపవైద్యాధికారి డాక్టర్ కే. మంజుల, డీఈఈ (ఎస్డబ్ల్యుఎం) మహేశ్వర్, ఏఈ మధురిమ, సానిటరీ సూపర్వైజర్ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి