ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలి – రామన్నపేటలో మహా ధర్నా
ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలి – రామన్నపేటలో మహా ధర్నా
స్థానికం బృందం
వీబీజీ రామ్జీ రద్దు చేయాలని డిమాండ్
రామన్నపేట ఎంపీడీఓ కార్యాలయం ముందు వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఉపాధి హామీ కూలీలతో మహా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర కార్యదర్శి కొండమడుగు నర్సింహా, జిల్లా ఉపాధ్యక్షుడు జల్లెల పెంటయ్య మాట్లాడుతూ మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసి గ్రామీణ పేదలకు ఉపాధిని దూరం చేయడానికే కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్జీ తీసుకువచ్చిందని ఆరోపించారు.
పోరాటాల ద్వారా సాధించుకున్న ఉపాధి హామీ చట్టాన్ని మార్పులు చేసి గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించే బాధ్యత నుంచి కేంద్ర ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందన్నారు. ఉపాధి హామీ చట్టం కోట్లాది గ్రామీణ పేదలకు జీవనాధారంగా నిలిచిందని పేర్కొన్నారు. కొత్త చట్టంలో హక్కులు, హామీలు లేకపోవడంతో పాటు భద్రత కూడా లేకపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉపాధి హామీ కార్మికులు ఎండలో పనిచేస్తూ నిలువ నీడ లేకుండా, తాగునీటి సదుపాయం లేకుండా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. చేసిన పనికి సమయానికి కూలి అందకపోవడం వల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. రామన్నపేట మండలంలో పే స్లిప్లు ఇవ్వకపోవడం, జాబు కార్డుల్లో నమోదు చేయకపోవడం వంటి సమస్యలు కొనసాగుతున్నాయని ఆరోపించారు.
దీర్ఘకాలంగా ఒకే మండలంలో పనిచేస్తున్న ఉపాధి హామీ సిబ్బంది, అధికారులను బదిలీ చేయాలని కూడా డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో మునిపంపుల, దుబ్బాక గ్రామ సర్పంచులు బొడ్డుపల్లి వెంకటేశం, గట్టు నర్సింహా, రైతు సంఘం మండల అధ్యక్షుడు బోయిని ఆనంద్, కార్యదర్శి గన్నేబోయిన విజయభాస్కర్, సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు వనం ఉపేందర్, మండల నాయకులు కూరేళ్ల నర్సింహాచారి, కందుల హనుమతు, జంపాల అండాలు, కల్లూరి నగేష్, నాగటి ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి