ఉద్యమకారుల గుర్తింపులో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి
ఉద్యమకారుల గుర్తింపులో జర్నలిస్టులకు ప్రాధాన్యత ఇవ్వాలి
Biksham
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన జర్నలిస్టులను ఉద్యమకారులుగా గుర్తించి, వారి సేవలు, త్యాగాలకు తగిన గౌరవం కల్పించాలని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర అధ్యక్షుడు కె. విరాహత్ అలీ కోరారు.
మంగళవారం ట్యాంక్బండ్లోని తెలంగాణ అమర జ్యోతి వద్ద తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు, గౌరవం, సంక్షేమంపై జర్నలిస్టులతో ఉద్యమ గుర్తింపు కమిటీ నిర్వహించిన సంప్రదింపుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా విరాహత్ అలీ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో జర్నలిస్టులు కేవలం వార్తల ప్రసారానికే పరిమితం కాలేదన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, ఆవేదన, ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి ఉద్యమానికి నైతిక బలం చేకూర్చారని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రాంతం ఎదుర్కొన్న వివక్ష, సామాజిక-ఆర్థిక అసమానతలు, ప్రాంతీయ అన్యాయాలను దేశవ్యాప్తంగా చర్చకు తీసుకువచ్చిన వారిలో జర్నలిస్టుల పాత్ర కీలకమని ఆయన అన్నారు. పలు ప్రాంతాల్లో జర్నలిస్టులు ఉద్యమకారులతో కలిసి ర్యాలీలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడంతో పాటు కొన్ని జాయింట్ యాక్షన్ కమిటీలకు నాయకత్వం కూడా వహించారని గుర్తు చేశారు.
ఉద్యమ సమయంలో పోలీసుల లాఠీచార్జీలు, కెమెరాల ధ్వంసం, తప్పుడు కేసులు, బెదిరింపులు, వార్తా సేకరణకు ఆటంకాలు వంటి అనేక ఇబ్బందులను జర్నలిస్టులు ఎదుర్కొన్నప్పటికీ వెనుకడుగు వేయలేదన్నారు. పలువురు జర్నలిస్టులు ఉద్యమంలో పాల్గొన్న కారణంగా ఉద్యోగాలు కోల్పోగా, మరికొందరు యాజమాన్యాల ఒత్తిళ్లను ఎదుర్కొన్నారని తెలిపారు.
వ్యక్తిగత ప్రయోజనాలను పక్కనపెట్టి తెలంగాణ సమాజం కోసం తమ జీవితాలను అంకితం చేసిన జర్నలిస్టులకు ఉద్యమకారులుగా గుర్తింపు కల్పించేలా ఉద్యమ గుర్తింపు కమిటీ సానుకూల నిర్ణయం తీసుకోవాలని విరాహత్ అలీ విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా టీయూడబ్ల్యూజే తరఫున వినతిపత్రాన్ని కమిటీ సభ్యులు ప్రొఫెసర్ కోదండరాం, రాములు నాయక్, శోభన్ రెడ్డికి అందజేశారు. కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి