తెలంగాణ ఏర్పాటును ‘భారత్-పాక్ విభజన’తో పోల్చడం దేశద్రోహం: బీఆర్ఎస్వీ నేత ఆగ్రహం
తెలంగాణ ఏర్పాటును ‘భారత్-పాక్ విభజన’తో పోల్చడం దేశద్రోహం: బీఆర్ఎస్వీ నేత ఆగ్రహం
Editor Desk
నకిరేకల్, :
పార్లమెంట్ ఆమోదంతో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ‘భారత్-పాకిస్తాన్ విభజన’తో పోల్చడం దేశద్రోహానికి సమానమని బీఆర్ఎస్వీ నకిరేకల్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు జెట్టి శివ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్ చట్టం ద్వారా, భారత రాజ్యాంగ పరిరక్షణలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తక్కువ చేసి చూపడం అసహనీయమన్నారు. ఈ వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని, పార్లమెంట్ సాక్షిగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని తేజస్వీ సూర్యతో పాటు బీజేపీ అగ్రనాయకత్వాన్ని డిమాండ్ చేశారు.
దశాబ్దాల పోరాటం, వేలాది మంది అమరుల త్యాగాలు, ప్రజల దీర్ఘకాల ఆకాంక్షల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని ఆయన గుర్తుచేశారు. అలాంటి చారిత్రాత్మక ప్రక్రియను వక్రీకరించడం తగదన్నారు.
అలాగే, తెలంగాణ ప్రజల ఓట్లతో ఎన్నికైన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఈ అంశంపై స్పందించకపోవడం బాధాకరమని, ప్రజల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందని పేర్కొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంపై ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి