సోమందేపల్లిలో గ్యాస్ కొరతపై ఆందోళన – సకాలంలో సరఫరా చేయాలని సిపిఐ డిమాండ్
సోమందేపల్లిలో గ్యాస్ కొరతపై ఆందోళన – సకాలంలో సరఫరా చేయాలని సిపిఐ డిమాండ్
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండల కేంద్రంలో గ్యాస్ కొరత కారణంగా వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సిపిఐ జిల్లా కమిటీ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. గ్యాస్ బుకింగ్ చేసుకున్న ప్రతి వినియోగదారునికి సకాలంలో సిలిండర్లు అందేలా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
సాధారణంగా పెనుకొండలోని శ్రీ రాఘవేంద్ర ఇండానే గ్యాస్ ఏజెన్సీ నుంచి సోమందేపల్లికి రోజుకు 60 సిలిండర్లు సరఫరా అయ్యేవి. అయితే అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో గ్యాస్ కొరత ఏర్పడడంతో డిమాండ్ పెరిగింది. ఈ క్రమంలో శనివారం కేవలం 32 సిలిండర్లు మాత్రమే సరఫరా కావడంతో ముందుగా బుకింగ్ చేసుకున్న సుమారు 60 మంది వినియోగదారులు నిరాశకు గురయ్యారు.
ఈ విషయంపై స్థానిక గ్యాస్ సిబ్బందిని సిపిఐ నాయకులు ప్రశ్నించగా, డిమాండ్ అధికంగా ఉండటంతో సరఫరా తగ్గిందని వారు తెలిపారు. అనంతరం ఏజెన్సీ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి మునుపటిలాగే 60 సిలిండర్లు పంపాలని కోరినా స్పందన రాకపోవడంతో వినియోగదారులతో కలిసి సిపిఐ నాయకులు హిందూపురం రహదారిపై నిరసన చేపట్టారు.
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. గ్యాస్ ఏజెన్సీతో మాట్లాడిన అనంతరం అదనంగా 20 సిలిండర్లు సోమందేపల్లికి పంపించారు. వాటిని సిపిఐ నాయకుల సమక్షంలో వినియోగదారులకు పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బాలస్వామి, జిల్లా కౌన్సిల్ సభ్యులు శీలా నారాయణస్వామి, మండల సహాయ కార్యదర్శి అంజనమ్మతో పాటు పలువురు వినియోగదారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి