శ్రీ సత్యసాయి జిల్లా కొత్తచెరువు మండల కేంద్రంలో బాలికల విద్యార్థుల కోసం నిర్మించ తలపెట్టిన హాస్టల్ భవనం నేడు శిథిలావస్థకు చేరినా ప్రభుత్వాలు, సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడం తీవ్ర ఆందోళనకారంగా ఉంది అని మండిపడ్డారు.హాస్టల్ నిర్మాణానికి శంకుస్థాపన చేసి 12 నుండి 15 సంవత్సరాలు గడుస్తున్నా, నేటికీ నిర్మాణ పనులు పూర్తి కాకపోవడం, భవనం నిరుపయోగంగా మారి శిథిలావస్థకు చేరడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని వారు అన్నారు. ప్రజల అవసరాల కోసం కేటాయించిన కోట్లాది రూపాయల ప్రజాధనం వృథా అవుతున్నా అధికారులు చర్యలు తీసుకోకపోవడం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు.పేద, గ్రామీణ కుటుంబాలకు చెందిన బాలికలకు సురక్షితమైన వసతి కల్పించాల్సిన హాస్టల్ను ఇంతకాలం నిర్లక్ష్యం చేయడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. వెంటనే సంబంధిత అధికారులు హాస్టల్ను పరిశీలించి, ప్రస్తుత పరిస్థితిపై సమగ్ర నివేదిక రూపొందించి, అవసరమైతే పాత నిర్మాణాన్ని తొలగించి నాణ్యతా ప్రమాణాలతో కొత్త భవనం నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఈ సమస్యపై కొత్తచెరువు CITU మండల కార్యదర్శి అంకె ముత్యాలు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎస్. వెంకటేష్, హమాలీల సంఘం నాయకులు కే. శంకర్ రెడ్డి స్పందించి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు.ప్రభుత్వం తక్షణమే స్పందించి బాలికల హాస్టల్ నిర్మాణాన్ని పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకురావాలని, లేనిపక్షంలో CITU, వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులను సమీకరించి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి