శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగాతోనే రక్షణ.!
శారీరక, మానసిక ఆరోగ్యానికి యోగాతోనే రక్షణ.!
NM Yadav
ప్రతి ఒక్కరూ ఫిట్నెస్పై దృష్టి సారించాలిజిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపు..
ఘనంగా ప్రారంభమైన యువజన వారోత్సవాలు..
ఉత్సాహంగా సాగిన 2కే మారథాన్ రన్..
నల్గొండ : ప్రతి ఒక్కరూ తమ శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో 'ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల యాక్షన్ ప్లాన్' చురుగ్గా సాగుతోంది. ఇందులో భాగంగా సోమవారం నుంచి జిల్లా క్రీడలు, యువజన సర్వీసుల శాఖ ఆధ్వర్యంలో 'యువజన వారోత్సవాలు' ఘనంగా ప్రారంభమయ్యాయి. మే 18 నుండి 23 వరకు వారం రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో భాగంగా, తొలిరోజు సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని డాక్టర్స్ కాలనీలో గల విద్యా గ్రామర్ స్కూల్లో "ఫిట్ & యాక్టివ్ తెలంగాణ" నినాదంతో ప్రత్యేక యోగా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కలెక్టర్ చంద్రశేఖర్ ముఖ్యఅతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
యోగా జీవితంలో భాగం కావాలి..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. నిత్య జీవితంలో రకరకాల పనుల ఒత్తిడి వల్ల మానవ శరీరం తీవ్ర అలసటకు గురవుతుందని పేర్కొన్నారు. దీనిని అధిగమించడానికి పౌష్టికాహారంతో పాటు నిత్యం వ్యాయామం, యోగా చేయడం ఎంతో అవసరమన్నారు. యోగ అనేది కేవలం ఒక రోజు చేసేది కాదు, అది ప్రతి ఒక్కరి జీవితంలో ఒక భాగం కావాలి. శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉన్నప్పుడే అనుకున్న లక్ష్యాలను సాధించగలం. ప్రతి ఒక్కరూ ఫిట్నెస్ను ఒక అలవాటుగా మార్చుకుంటే రోగాల బారిన పడకుండా ఉండవచ్చు. ఈ వారం రోజుల పాటు జిల్లాలో 'ఫిట్ తెలంగాణ - ఫిజికల్ లిటరసీ' పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు ఉంటాయని, అలాగే పర్యాటక రంగానికి సంబంధించిన ప్రత్యేక కార్యక్రమాలను కూడా నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించేందుకు ఈ వారోత్సవాలు ఎంతగానో దోహదపడతాయన్నారు.
ఉరకలెత్తిన ఉత్సాహం.. 2కే రన్ ప్రారంభం..
యోగా కార్యక్రమం అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన '2కే మారథాన్ రన్' ను కలెక్టర్ చంద్రశేఖర్ జెండా ఊపి ప్రారంభించారు. కేవలం ప్రారంభించడమే కాకుండా, స్వయంగా ఆయన కూడా పరుగులో పాల్గొని యువతలో సరికొత్త ఉత్సాహాన్ని నింపారు. అధికారులతో పాటు పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువతీ యువకులతో మారథాన్ మార్గం కిక్కిరిసిపోయింది. ఈ అట్టహాస కార్యక్రమాల్లో స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, జెడ్పీ సీఈఓ ప్రేమ్ కరణ్ రెడ్డి, జిల్లా క్రీడలు మరియు యువజన సర్వీసుల శాఖ అధికారి అక్బర్ అలీ, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, పాఠశాల యాజమాన్యం, విద్యార్థులు మరియు క్రీడాకారులు పాల్గొన్నారు..

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి