శాలిగౌరారంలో ఆర్ఐపై అవినీతి ఆరోపణల దుమారం
శాలిగౌరారంలో ఆర్ఐపై అవినీతి ఆరోపణల దుమారం
Komidala Mahender reddy
లంచాలు తీసుకుని రికార్డులు మారుస్తున్నాడంటూ రైతుల ఆగ్రహం.. సస్పెన్షన్కు డిమాండ్.
శాలిగౌరారం, జూలై 20:
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ ఇన్స్పెక్టర్ (ఆర్ఐ)గా విధులు నిర్వహిస్తున్న రఫీపై అవినీతి ఆరోపణలు తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. సర్వేలు నిర్వహించకుండానే డబ్బులు వసూలు చేస్తూ భూ రికార్డుల్లో మార్పులు చేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు.ఈ నెల 14వ తేదీన మండలంలోని వద్దిపాముల, తక్కెళ్లపాడు గ్రామాలకు చెందిన రైతులు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి ఆర్ఐ రఫీని తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం తమ సమస్యలను వివరిస్తూ ఆర్డీవోతో పాటు జిల్లా కలెక్టర్కు వినతిపత్రాలు అందజేశారు.
రైతుల ఆరోపణల ప్రకారం, భూ సర్వేలు చేయకుండానే రికార్డులు మార్చేందుకు డబ్బులు తీసుకుంటున్నారని, ఆదాయ ధ్రువీకరణ పత్రం (ఇన్కమ్ సర్టిఫికెట్) కోసం రూ.500, కళ్యాణలక్ష్మి దరఖాస్తుల కోసం రూ.5 వేల వరకు వసూలు చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ సేవలను పొందేందుకు ప్రజల నుంచి అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. రెవెన్యూ శాఖపై ప్రజల విశ్వాసాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్న అధికారులపై ఉన్నతాధికారులు వెంటనే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు.
అయితే ఈ ఆరోపణలపై సంబంధిత ఆర్ఐ రఫీ లేదా రెవెన్యూ శాఖ అధికారుల నుంచి అధికారిక స్పందన వెలువడాల్సి ఉంది. రైతుల ఫిర్యాదుల నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ఎలాంటి చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి