శాలిగౌరారం మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
శాలిగౌరారం మండలంలో కలెక్టర్ సుడిగాలి పర్యటన
Editor Desk
పాఠశాలలు, అంగన్వాడీలపై ఆకస్మిక తనిఖీలు
నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలంలో జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సుడిగాలి పర్యటన నిర్వహించి పలు ప్రభుత్వ సంస్థలను, పనులను తనిఖీ చేశారు. ప్రభుత్వ పథకాల అమలుపై క్షేత్రస్థాయిలో అధికారులకు కీలక సూచనలు చేశారు.
వల్లాల గ్రామంలో గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వనమహోత్సవం నర్సరీని పరిశీలించిన కలెక్టర్… మొక్కల పెంపకం, వాటి రకాలు, టార్గెట్, జియోట్యాగింగ్ తదితర వివరాలను తెలుసుకున్నారు. వర్షాకాలానికి ముందుగానే మొక్కలు నాటే స్థలాలను గుర్తించి ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గ్రామానికి కేటాయించిన 13,800 మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
పల్లె ప్రకృతి వనాన్ని తనిఖీ చేసి గ్రామస్తుల ఉదయం నడకకు అనుకూలంగా అభివృద్ధి చేయాలని సూచించారు. అనంతరం ఉపాధి హామీ పథకం కింద చేపడుతున్న ఫిష్పాండ్ పనులను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. పనులు చేసే చోట నీడ, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పించాలని డిఆర్డిఓ శేఖర్రెడ్డిని ఆదేశించారు.
ఇందిరమ్మ ఇల్లు, గ్రామపంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి గ్రామసభ ఏర్పాట్లపై సర్పంచ్, అధికారులతో చర్చించారు. గ్రామ సమస్యలను గ్రామసభలో చర్చించి పరిష్కార మార్గాలు కనుగొనాలని సూచించారు.
తెలంగాణ మోడల్ స్కూల్ను సందర్శించిన కలెక్టర్ తాగునీటి ప్లాంట్ మరమ్మతులు చేయించాలని, డ్యూయల్ డెస్క్లు అమర్చాలని ఆదేశించారు. కట్టెలపై వంట చేయడాన్ని నిలిపివేసి గ్యాస్పై వండాలని సూచించారు.
అడ్లూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని పరిశీలించి గర్భిణీలు, బాలింతలకు అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మంజూరైన భవన నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామ సమాఖ్య భవనాలు, డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పురోగతిని సమీక్షించారు.
ఈ పర్యటనలో ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, తహసిల్దార్ వరప్రసాద్, పంచాయతీ కార్యదర్శి కృష్ణయ్య, ఎంఈఓ సైదులు, ప్రిన్సిపల్ కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి