సీటుంది.. సార్ లేరు.. ‘చౌటుప్పల్’ విద్యాశాఖ తీరిది!
సీటుంది.. సార్ లేరు.. ‘చౌటుప్పల్’ విద్యాశాఖ తీరిది!
K.RAVI
* అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల వినూత్న నిరసన
* కుర్చీని బయటపెట్టి ఆందోళన.. ఆచూకీ తెలపాలంటూ పోలీసులకు పిటిషన్!
మండల విద్యాధికారి (ఎంఈఓ) నిర్లక్ష్య వైఖరికి నిరసనగా చౌటుప్పల్లో అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాలు గురువారం హోరెత్తాయి. విద్యార్థుల సమస్యలను పట్టించుకోకుండా, విధులకు హాజరుకాకుండా ప్రజలకు అందుబాటులో ఉండటం లేదంటూ విద్యార్థి నేతలు చౌటుప్పల్ ఎంఈఓ కార్యాలయాన్ని ముట్టడించారు.కార్యాలయానికి వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులకు ఎంఈఓ అందుబాటులో లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంఈఓ చాంబర్లోని ఆయన కుర్చీని కార్యాలయం బయటకు తీసుకువచ్చి రోడ్డుపై వేశారు. దానిపై "ఎంఈఓ ఎక్కడ?", "ప్రజలకు అందుబాటులో లేని అధికారి" అంటూ రాసి ఉన్న ప్లకార్డులను ఉంచి వినూత్నంగా నిరసన తెలిపారు. విద్యాశాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు.నిరసన అనంతరం అఖిలపక్ష నాయకులు చౌటుప్పల్ పోలీస్ స్టేషన్కు తరలివెళ్లారు. విధులకు గైర్హాజరవుతూ, ప్రజలకు దొరకకుండా పోయిన ఎంఈఓ ఆచూకీని కనిపెట్టాలంటూ స్థానిక సీఐకి ఒక వింత పిటిషన్ను సమర్పించారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.మండలంలోని ప్రైవేట్ విద్యాసంస్థలు ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ ఇష్టారాజ్యంగా ఫీజులు వసూలు చేస్తున్నాయని నాయకులు ఆరోపించారు. వీటిపై పలుమార్లు ఫిర్యాదులు చేసినా ఎంఈఓ కనీసం స్పందించకపోవడం వెనుక ఉన్న అంతర్యమేమిటని ప్రశ్నించారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సదరు అధికారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేనిపక్షంలో ఈ ఉద్యమాన్ని జిల్లా, రాష్ట్ర స్థాయికి ఉధృతం చేస్తామని హెచ్చరించారు.ఈ నిరసన కార్యక్రమంలో అఖిలపక్ష విద్యార్థి, యువజన సంఘాల నాయకులు వీరమళ్ళ కార్తీక్ గౌడ్, పల్లె మధు, దిండు భాస్కర్, నలపరాజు రమేష్, కొండూరు వెంకన్న, బండి గారి శ్రీధర్, పబ్బు వంశీ, తిగుల్ల శ్రీను, ఒంటెద్దు లింగస్వామి, రాఘవ, కొప్పు రామకృష్ణ, కొల్లూరు నవీన్, అత్తు, చింటూ, హరీష్, ప్రవీణ్, ఇర్ఫాన్, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి