ఎస్ఐఆర్లో పారదర్శకత లోపించింది. పౌర సమాజం ప్రశ్నించాలి: డా. పరకాల ప్రభాకర్.
ఎస్ఐఆర్లో పారదర్శకత లోపించింది. పౌర సమాజం ప్రశ్నించాలి: డా. పరకాల ప్రభాకర్.
Editor Desk
హైదరాబాద్,
ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయని, దీనిపై పౌర సమాజం, మేధావులు ప్రశ్నించాలని ప్రముఖ ఆర్థిక, సామాజిక విశ్లేషకుడు డా. పరకాల ప్రభాకర్ అన్నారు. మాజీ ప్రధాని, భారతరత్న పి.వి. నరసింహారావు 105వ జయంతి సందర్భంగా గురువారం డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో నిర్వహించిన పీవీ స్మారకోపన్యాసంలో ఆయన మాట్లాడారు.
‘ఎస్ఐఆర్ 2025–26: భారతదేశ భావనను ఛిన్నాభిన్నం చేయడమా?’ అంశంపై ప్రసంగించిన ఆయన.. ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియలో విధానపరమైన స్పష్టత లేదని, పలు రాష్ట్రాల్లో లక్షలాది మంది ఓటర్ల పేర్లు తొలగించినా సరైన వివరణ ఇవ్వడం లేదని విమర్శించారు. ఎస్ఐఆర్ వల్ల మైనారిటీలు, దళితులు, ఆదివాసులు, మహిళలు, ఆర్థికంగా బలహీన వర్గాలపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నందున రెండు తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం ఈ ప్రక్రియ చేపట్టాల్సిన అవసరం లేదని అభిప్రాయపడ్డారు.
సభకు అధ్యక్షత వహించిన వర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొ. ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. పారదర్శకమైన, కచ్చితమైన ఓటర్ల జాబితానే ప్రజాస్వామ్యానికి పునాదన్నారు. గతంలో ఓటర్లు నాయకులను ఎన్నుకునేవారని, ఇప్పుడు పాలకులే ఎవరెవరు ఓటర్లుగా ఉండాలో నిర్ణయించే పరిస్థితి ఏర్పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ నిర్మాత డా. బి.ఆర్. అంబేద్కర్ ప్రతిపాదించిన సార్వత్రిక వయోజన ఓటుహక్కు స్ఫూర్తికి విరుద్ధంగా ఇటువంటి పరిణామాలు ఉన్నాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఎమ్మెల్సీ సురభి వాణిదేవి మాట్లాడుతూ.. పి.వి. నరసింహారావు దూరదృష్టి, నాయకత్వం దేశాభివృద్ధికి చిరస్మరణీయమని కొనియాడారు. డైరెక్టర్ (అకాడమిక్) ప్రొ. జి. పుష్ప చక్రపాణి స్వాగతం పలకగా, రిజిస్ట్రార్ డా. ఎల్.వి.కె. రెడ్డి వందన సమర్పణ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి