రమణేశ్వర మహాక్షేత్రాన్ని సందర్శించిన విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ శ్రీ సత్యం
రమణేశ్వర మహాక్షేత్రాన్ని సందర్శించిన విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ శ్రీ సత్యం
Komidala Mahender reddy
తెలంగాణలో వెలసిన విశిష్ట శైవ క్షేత్రమైన రమణేశ్వర మహాక్షేత్రాన్ని విశ్వ హిందూ పరిషత్ ఆల్ ఇండియా జనరల్ సెక్రటరీ శ్రీ సత్యం గారు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారిని దర్శించుకుని ఆశీర్వాదం పొందారు. అనంతరం రమణేశ్వర మహాక్షేత్రంలోని పవిత్రమైన బంగారు శివలింగానికి భక్తిశ్రద్ధలతో అభిషేకం నిర్వహించారు.
రమణేశ్వరంలోని ద్విసహస్ర శివలింగాలు, శ్రీచక్రాలు, వివిధ దేవతా ఆలయాలను దర్శించిన శ్రీ సత్యం గారు ఆధ్యాత్మిక ఆనందాన్ని వ్యక్తం చేశారు. రమణేశ్వరంలో హిందూ ధర్మానికి చెందిన అన్ని రకాల దేవతామూర్తులు, దేవతల విగ్రహాలు దర్శనమిస్తున్నాయని, ఇది సనాతన ధర్మ వైభవాన్ని ఒకేచోట ప్రతిబింబించే మహాక్షేత్రమని ఆయన అన్నారు.
వేదాగమ సంప్రదాయాలు, శివారాధన, శ్రీచక్రారాధన, భారతీయ ఆధ్యాత్మిక సంస్కృతి గొప్పతనాన్ని ప్రత్యక్షంగా అనుభవింపజేసే క్షేత్రంగా రమణేశ్వరం నిలుస్తోందని అభిప్రాయపడిన శ్రీ సత్యం గారు, ఈ క్షేత్ర నిర్మాణంలో ఇమిడి ఉన్న వేద, ఆగమ శాస్త్ర పరిజ్ఞానాన్ని అవగాహన చేసుకున్నారు.
తెలంగాణ భూమిపై ఇలాంటి గొప్ప శైవ క్షేత్రం వెలసి ఉండటం హిందూ సమాజానికి గర్వకారణమని, ఇది తెలంగాణను దేశంలోనే ఒక మహా శైవ క్షేత్రంగా నిలబెడుతుందని ఆయన పేర్కొన్నారు. సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి వారి దార్శనికత వల్ల సాధ్యమైన ఈ నిర్మాణం, రాబోయే తరాలకు హిందూ ధర్మంపై అవగాహన, గౌరవం పెంపొందించడంలో విశేషంగా దోహదపడుతుందని ఆయన అన్నారు.
యువత కేవలం ఆధునిక విద్యలోనే కాకుండా, మన ధర్మం, సంస్కృతి, ఆధ్యాత్మిక సంపద గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని శ్రీ సత్యం అభిప్రాయపడ్డారు. రమణేశ్వరంలాంటి క్షేత్రాలు యువతకు హిందూ ధర్మం యొక్క లోతు, శాస్త్రీయత, ఆధ్యాత్మికతను పరిచయం చేసే ఆధ్యాత్మిక కేంద్రాలుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఇలాంటి పవిత్ర క్షేత్రాలను ప్రతి హిందువు దర్శించి, సనాతన ధర్మ పరిరక్షణలో భాగస్వాములు కావాలని శ్రీ సత్యం పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ వెంకటేశ్వర రాజు , స్టేట్ జాయింట్ సెక్రటరీ శ్రీ భాను ప్రసాద్ గారు, స్టేట్ టోలి మెంబర్ శ్రీ మురళీ మోహన్ రెడ్డి , స్టేట్ టోలి మెంబర్ శ్రీ రవి ప్రకాశ్ రెడ్డి , స్టేట్ టోలి మెంబర్ శ్రీ చంద్ర మోహన్ , భొంగీర్ ఇంచార్జ్ శ్రీ శ్రీనివాస్ సహా పలువురు ప్రముఖ VHP నాయకులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి