సమస్యల వలయాల్లో సరస్వతి నిలయాలు. భువనగిరి కేజీబీవీలో నీటి కష్టాలు
సమస్యల వలయాల్లో సరస్వతి నిలయాలు. భువనగిరి కేజీబీవీలో నీటి కష్టాలు
Editor Desk
అధికారుల సందర్శనలే తప్ప.. పరిష్కారం శూన్యం
భువనగిరి: జిల్లా కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం (కేజీబీవీ)లో తాగు, వినియోగ నీటి సమస్య విద్యార్థినులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. సుమారు 300 మంది బాలికలు విద్యనభ్యసిస్తున్న ఈ విద్యాలయంలో నీటి సరఫరాకు శాశ్వత పరిష్కారం చూపడంలో అధికారులు విఫలమయ్యారని తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం నాయకులు ఆరోపిస్తున్నారు.
గతంలో నీటి కొరత తీవ్రంగా ఉండటంతో అప్పటి ఆర్డీవో భూపాల్రెడ్డి ప్రభుత్వ నిధులతో బోరు వేయించినప్పటికీ, అది వర్షాకాలంలో మాత్రమే అవసరాలను తీర్చగలుగుతోందని చెబుతున్నారు. ఎండాకాలం ప్రారంభమైతే మళ్లీ నీటి సమస్య తలెత్తుతోందని వాపోతున్నారు.
పాఠశాలలు ప్రారంభమై వారం రోజులు గడిచినా, వర్షాలు లేకపోవడం, ఉష్ణోగ్రతలు అధికంగా ఉండటంతో నీటి కొరత మరింత తీవ్రమైందని తెలుస్తోంది. స్నానాలు, ఇతర అవసరాలకు తగినంత నీరు అందక విద్యార్థినులు ఇబ్బందులు పడుతున్నారని సమాచారం. కొందరు విద్యార్థినులు ఆరోగ్య సమస్యల కారణంగా సెలవులు పెట్టుకుని ఇళ్లకు వెళ్తున్నట్లు తల్లిదండ్రులు చెబుతున్నారు.
ఇందిరమ్మ కాలనీతో పాటు కేజీబీవీకి ప్రత్యేకంగా ట్యాంకర్లను కేటాయించినప్పటికీ, నీటి సరఫరా సక్రమంగా జరగడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. మండల స్థాయి అధికారుల నుంచి జిల్లా స్థాయి అధికారుల వరకు పలువురు పాఠశాలను సందర్శించినా సమస్య మాత్రం యథాతథంగానే ఉందని స్థానికులు అంటున్నారు.
ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థినులకు తగిన నీటి వసతి కల్పించాలని, శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని బాలికలు, తల్లిదండ్రులు, బాలల హక్కుల సంఘం నాయకులు కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి