నీర్నేముల పాఠశాలలో సమస్యల పరిష్కారానికి సీపీఎం
నీర్నేముల పాఠశాలలో సమస్యల పరిష్కారానికి సీపీఎం
Editor Desk
రామన్నపేట: మండలంలోని నీర్నేముల గ్రామ ప్రాథమికోన్నత పాఠశాలలో నెలకొన్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం సీపీఎం గ్రామశాఖ ఆధ్వర్యంలో పాఠశాలలో సర్వే నిర్వహించారు.
ఈ సందర్భంగా సీపీఎం మండల కమిటీ సభ్యుడు, మాజీ ఎంపీపీ నాగటి ఉపేందర్ మాట్లాడుతూ.. పాఠశాలలో ఏడు తరగతులు, 60 మంది విద్యార్థులు ఉన్నప్పటికీ కేవలం ఆరుగురు ఉపాధ్యాయులు మాత్రమే పనిచేస్తున్నారని తెలిపారు. ఆగస్టులో మరో ఉపాధ్యాయురాలు పదవీ విరమణ చేయనున్న నేపథ్యంలో ఉపాధ్యాయుల సంఖ్య ఐదుకు తగ్గుతుందని, దీంతో బోధనపై ప్రభావం పడే అవకాశం ఉందన్నారు. విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా అదనపు ఉపాధ్యాయులను వెంటనే కేటాయించాలని కోరారు.
మధ్యాహ్న భోజన పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.6.18 మాత్రమే కేటాయించడం వల్ల నాణ్యమైన, పౌష్టికాహారం అందించడం కష్టంగా మారిందన్నారు. పాఠశాలలో 12 ఫ్యాన్లు ఉండగా నాలుగు పనిచేయడం లేదని, వాటి స్థానంలో కొత్త ఫ్యాన్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. మంచినీటి ట్యాంకును క్రమం తప్పకుండా శుభ్రపరిచేలా చర్యలు తీసుకోవాలన్నారు.
పాఠశాలలో 31 మంది విద్యార్థినులు ఉండగా ఒకే మరుగుదొడ్డి మాత్రమే ఉండటం ఆందోళనకరమన్నారు. ప్రస్తుతం ఉన్న మరుగుదొడ్లు కూడా శిథిలావస్థకు చేరుకున్నాయని, బాలికల కోసం అదనపు మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీపీఎం గ్రామశాఖ కార్యదర్శి నాగటి లక్ష్మణ్, సహాయ కార్యదర్శి ఏశబోయిన రామచంద్రం, మాజీ వార్డు సభ్యులు నేమనంది లింగయ్య, బోయిని వేణు, నాగటి నరేష్, ఆవుల మత్స్యగిరి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి