ముక్కులో గడియారం 'సెల్' ఇరికితే రూ.30 వేలా?
ముక్కులో గడియారం 'సెల్' ఇరికితే రూ.30 వేలా?
NM Yadav
రూ.2,500 లకే తీసేసిన మరో ప్రైవేటు ఆసుపత్రి..
నల్గొండ 'చిన్మయి ఈఎన్టీ' దవాఖానా నిర్వాకం..
బాధితుల ఆవేదన విచారణ జరుపుతామన్న వైద్య ఆరోగ్య శాఖ..
చిన్మయి ఆసుపత్రికి పర్మిషన్ ఉందా? ఆపరేషన్ థియేటర్ లేకున్నా సర్జరీలుచేస్తున్నారా?
నల్గొండ : రోగం చిన్నదైనా.. పెద్దదైనా సరే, రోగి నుంచి వేలకు వేలు గుంజడమే పరమావధిగా భావిస్తున్నాయి కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు. ఏ చిన్న సమస్యతో వెళ్లినా దాన్ని భూతద్దంలో చూపిస్తూ, రోగులను, వారి కుటుంబ సభ్యులను భయాందోళనలకు గురిచేసి పెద్ద మొత్తంలో డబ్బులు దండుకుంటున్నాయి. నల్గొండ జిల్లా కేంద్రంలోని 'చిన్మయి ఈఎన్టీ' ఆసుపత్రిలో తాజాగా చోటుచేసుకున్న ఘటనే దీనికి నిదర్శనం. మునుగోడుకు చెందిన శివ అనే నాలుగేళ్ల బాలుడు ఆడుకుంటూ ముక్కులో వాచ్సెల్ (చిన్న బ్యాటరీ) ఇరికించుకున్నాడు. కంగారుపడిన తల్లిదండ్రులు వెంటనే జిల్లా కేంద్రంలోని చిన్మయి ఆసుపత్రికి పరుగెత్తారు.
భయపెట్టి.. బాదారు..
ఆసుపత్రికి వెళ్లిన వెంటనే తల్లిదండ్రులను భయపెడుతూ ఓపీ ఫీజు, స్కాన్ల పేరుతోనే మొదట రూ.3,000 పైగా వసూలు చేశారు. అంతటితో ఆగకుండా, "ముక్కులో సెల్ పగిలి నల్లటి వసరు కారుతోంది.. వెంటనే తీసేయాలి లేదంటే అది ఊపిరితిత్తుల్లోకి పోయి బాబు చనిపోతాడు" అంటూ వైద్యులు తీవ్రంగా భయపెట్టారు. దాన్ని తొలగించడానికి రూ.30,000 ఖర్చవుతుందని తేల్చి చెప్పారు. అంత అంత ఇచ్చుకోలేమని తల్లిదండ్రులు బతిమిలాడటంతో.. కనీసం రూ.20,000 ఇవ్వాలని, లేదంటే ప్రమాదమని హెచ్చరించారు.
పక్క ఆసుపత్రిలో కేవలం రూ. 2,500 లకే..
అంత డబ్బు చెల్లించలేని స్థితిలో ఉన్న బాలుడి తండ్రి తాము కట్టిన ఓపీ డబ్బులైనా వెనక్కి ఇవ్వాలని కోరగా ఆసుపత్రి నిర్వాహకులు నిరాకరించారు. చేసేదేమీ లేక ఆ బాబును తీసుకొని పక్కనే ఉన్న మరో ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ వైద్యులు బాబును పరీక్షించి, కేవలం ఓపీ, ఎండోస్కోపీ, ట్రీట్మెంట్ అన్నింటికీ కలిపి కేవలం రూ.2,500 లకే ఆ సెల్ను సురక్షితంగా బయటకు తీశారు. పక్కపక్కనే ఉన్న ఆసుపత్రుల్లో పదింతల ధరల వ్యత్యాసం ఉండటంపై బాధితుడు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
పరిస్థితిని బట్టే వసూలు చేస్తాం..
ఈ విషయమై చిన్మయి ఆసుపత్రి యాజమాన్యాన్ని వివరణ కోరగా.. "రోగుల పరిస్థితులను బట్టే ఫీజు వసూలు చేస్తామని, ఇది బహిరంగ మార్కెట్" అంటూ నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారు. కాగా ఈ ఘటనపై జిల్లా వైద్యాధికారులను వివరణ కోరగా.. దీనిపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి