సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి..
సీఎం బహిరంగ సభ ఏర్పాట్లు పక్కాగా ఉండాలి..
NM Yadav
అధికారులను ఆదేశించిన నల్గొండ కలెక్టర్ బి. చంద్రశేఖర్..
ఎన్జీ కళాశాల మైదానంలో పనుల పరిశీలన..
నల్గొండ : రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి నల్గొండ పర్యటన నేపథ్యంలో ఈ నెల 28న నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు అన్ని ఏర్పాట్లు పక్కాగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన నల్గొండ పట్టణంలోని ఎన్.జీ. కళాశాల మైదానాన్ని సందర్శించి, సభా ఏర్పాట్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సభా వేదిక నిర్మాణం, గ్యాలరీలు, వాహనాల పార్కింగ్, రాకపోకల మార్గాలు, భద్రతా వలయం, విద్యుత్ సరఫరా, తాగునీరు, పారిశుద్ధ్యం తదితర అంశాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.
వర్షం వచ్చినా ఇబ్బంది కలగకూడదు..
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు సమన్వయంతో పనిచేయాలని స్పష్టం చేశారు. మైదానంలో ఎక్కడా ఎత్తుపల్లాలు లేకుండా మొరం వేసి సమానంగా (లెవలింగ్) చేయాలని అనంతరం గ్రౌండ్ మొత్తం రోలింగ్ చేయించాలని సూచించారు. పరిసర ప్రాంతాల్లో ఎక్కడా గుంతలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఒకవేళ వర్షం వచ్చినా మైదానంలో నీరు నిలిచిపోకుండా ఉండేలా ముందస్తుగా డ్రైనేజీ సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. మున్సిపాలిటీ ఆధ్వర్యంలో గ్రౌండ్ పరిసరాలను పూర్తిగా శుభ్రం చేయించాలన్నారు. సభా ప్రాంగణం చుట్టూ బలమైన బ్యారికేడ్లను ఏర్పాటు చేయాలని, సభకు వచ్చే ప్రతి ఒక్కరికీ వేదిక స్పష్టంగా కనిపించేలా ఇరువైపులా ఎల్ఈడీ స్క్రీన్లను అమర్చాలని చెప్పారు.
సాంస్కృతిక ప్రదర్శనలు ఇచ్చే కళాకారుల కోసం ప్రత్యేక వేదికను సిద్ధం చేయాలన్నారు. ముఖ్యమంత్రి ప్రసంగించే ప్రధాన వేదికను భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా తగినంత ఎత్తులో నిర్మించాలని ఆదేశించారు. అన్ని శాఖల అధికారులు నిర్ణీత గడువులోగా తమకు అప్పగించిన పనులను పూర్తి చేయాలని కలెక్టర్ ఉద్ఘాటించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో రెవిన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, స్థానిక సంస్థల ఇంచార్జ్ అదనపు కలెక్టర్ వై. అశోక్ రెడ్డి, తహసిల్దార్ పరశురాం మరియు వివిధ ప్రభుత్వ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి