రేణుక ఎల్లమ్మ బ్రహ్మోత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి
రేణుక ఎల్లమ్మ బ్రహ్మోత్సవాల్లో మంత్రి కోమటిరెడ్డి
Editor Desk
కనగల్,: మండలంలోని దర్వేశిపురం గ్రామంలో జరుగుతున్న శ్రీ రేణుక ఎల్లమ్మ బ్రహ్మోత్సవాలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి గురువారం ఆలయాన్ని సందర్శించి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
అమ్మవారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఆలయం నుంచి కళ్యాణ మండపం వరకు పట్టు వస్త్రాలను మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి సమర్పించారు. అనంతరం శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారు–జమదగ్ని మహర్షి దివ్య కళ్యాణోత్సవంలో మంత్రి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు లభించి సుఖశాంతులు, ఆయురారోగ్యాలు చేకూరాలని ప్రార్థించినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో నిర్వహించే ఆధ్యాత్మిక ఉత్సవాలు సామాజిక ఐక్యతను పెంపొందించడంతో పాటు సంప్రదాయాలను భావితరాలకు చేరవేస్తాయని పేర్కొన్నారు. ఆలయ అభివృద్ధికి అవసరమైన సహకారం అందించేందుకు ప్రభుత్వం తరఫున చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
బ్రహ్మోత్సవాల్లో భాగంగా నిర్వహించిన పూజా కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.
కార్యక్రమంలో తహసీల్దార్ పద్మ, ఎంపీడీవో వేద రక్షిత, ఆలయ చైర్మన్ వెంకట్రెడ్డి, ఈవో నాగిరెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, భక్తులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి