సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఐ చంద్ర మోహన్
సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: సీఐ చంద్ర మోహన్
RAPOLU LINGASWAMY
సైబర్ నేరాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సైదాబాద్ పోలీసుల ఆధ్వర్యంలో మంగళవారం లక్ష్మీనగర్ కాలనీ, సైదాబాద్ లోని ఏ–5 ఫంక్షన్ హాల్లో సైబర్ అవేర్నెస్ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక దుకాణదారులు, కాలనీవాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సైదాబాద్ సీఐ చంద్ర మోహన్ మాట్లాడుతూ ప్రస్తుతం సైబర్ మోసాలు రోజురోజుకు పెరుగుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా లేకపోతే సులభంగా మోసపోయే ప్రమాదం ఉందన్నారు. బ్యాంకు ఖాతా వివరాలు, ఓటీపీలు, ఏటీఎం పిన్ నంబర్లు, ఆధార్, పాన్ వంటి వ్యక్తిగత వివరాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇతరులకు చెప్పవద్దని సూచించారు.
ముఖ్యంగా ఫోన్ కాల్స్, వాట్సాప్ మెసేజీలు, సోషల్ మీడియా లింకుల ద్వారా వచ్చే మోసాలకు జాగ్రత్తగా ఉండాలని, తెలియని లింకులు క్లిక్ చేయొద్దని హెచ్చరించారు. మీ బ్యాంక్ ఖాతా బ్లాక్ అయింది,కేవైసీ అప్డేట్ చేయాలి,లాటరీ వచ్చింది. ఉద్యోగం ఇస్తాం వంటి పేర్లతో వస్తున్న సందేశాలు ఎక్కువగా మోసపూరితమైనవేనని తెలిపారు.
అదే విధంగా ఆన్లైన్ షాపింగ్, యూపీఐ చెల్లింపులు, క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేసే సమయంలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. డబ్బులు పంపించుకోవడానికి మాత్రమే క్యూ ఆర్ కోడ్ ఉపయోగించాలని, డబ్బులు వస్తాయని చెప్పి క్యూ ఆర్ కోడ్ స్కాన్ చేయమంటే నమ్మవద్దన్నారు. సైబర్ మోసాలకు గురైతే వెంటనే 1930 హెల్ప్లైన్కు ఫోన్ చేయాలని, సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయాలని కోరారు.
సమాజంలో ప్రతి ఒక్కరూ సైబర్ భద్రతపై అవగాహన పెంపొందించుకోవడం ద్వారా నేరాలను నివారించవచ్చని సీఐ చంద్ర మోహన్ పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి