రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఎస్పీ శరత్ చంద్ర పవార్
రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఎస్పీ శరత్ చంద్ర పవార్
Editor Desk
నల్గొండ పట్టణంలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో “అరైవ్ అలైవ్” కార్యక్రమంలో భాగంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలు అధికంగా నిర్లక్ష్యం, అతివేగం, ట్రాఫిక్ నియమాలను పట్టించుకోకపోవడం వల్ల జరుగుతున్నాయని తెలిపారు. ప్రతి వాహనదారు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాల్సిన బాధ్యత కలిగి ఉన్నారని స్పష్టం చేశారు.
హెల్మెట్ వినియోగంపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పోలీస్ కళాబృందం ప్రత్యేక ప్రదర్శనలు ఇచ్చింది. యమధర్మరాజు వేషధారణలో కళాకారులు అవగాహన కల్పిస్తూ హెల్మెట్ ధరించకపోతే ప్రమాదాల్లో ప్రాణనష్టం సంభవించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని వివరించారు. ఈ ప్రదర్శనకు ప్రజల నుంచి మంచి స్పందన లభించింది.
యువత అధిక వేగంతో వాహనాలు నడపడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయని ఎస్పీ తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం శిక్షార్హమని, అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
వాహనదారులు పత్రాలు సక్రమంగా కలిగి ఉండాలని, ట్రిపుల్ రైడింగ్ చేయరాదని, డ్రైవింగ్ సమయంలో మొబైల్ ఫోన్ వినియోగించకూడదని సూచించారు. రాబోయే రోజుల్లో పాఠశాలలు, కళాశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రమేష్, డీఎస్పీ శివరాం రెడ్డి, సిఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, వాహనదారులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి