రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు..జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్..
రోడ్డు ప్రమాదాల నివారణకు పకడ్బందీ చర్యలు..జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్, ఎస్పీ శరత్ చంద్ర పవార్..
NM Yadav
బ్లాక్ స్పాట్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలి..
నల్గొండ : జిల్లాలో రహదారి ప్రమాదాల నివారణకు అన్ని శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్తో కలిసి ‘జిల్లా స్థాయి రహదారి భద్రత’ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లాలోని రహదారులు, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రాంతాలు (బ్లాక్ స్పాట్స్), మరణాల సంఖ్యపై పోలీసు శాఖ రూపొందించిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను కలెక్టర్ వీక్షించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారి భద్రతపై సమాజంలోని అన్ని వర్గాలకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’లో భాగంగా ఏప్రిల్ 2న నిర్వహించనున్న గ్రామ, వార్డు సభల్లో ‘సురక్షితంగా చేరుకోండి’ కార్యక్రమంపై ప్రజలకు వివరించాలని సూచించారు. డ్రైవింగ్ లైసెన్స్ రిజిస్ట్రేషన్, ఆన్లైన్ సేవలపై రవాణా శాఖ అధికారులు చైతన్యం తీసుకురావాలన్నారు.
హైదరాబాద్ - విజయవాడ హైవేపై ట్రామా కేర్ సెంటర్..
జిల్లాలో జాతీయ రహదారి నిడివి ఎక్కువగా ఉన్నందున హైదరాబాద్-విజయవాడ హైవేపై అత్యవసర వైద్య సేవల కోసం త్వరలోనే ‘ట్రామా కేర్ సెంటర్’ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వెల్లడించారు. ప్రమాదం జరిగిన 20 నిమిషాల్లోపు పోలీసులు, సంబంధిత శాఖల అధికారులు ఘటనా స్థలానికి చేరుకునేలా హైవే పెట్రోలింగ్ను పటిష్టం చేయాలన్నారు. ఏప్రిల్ మొదటి వారంలోగా గుర్తించిన బ్లాక్ స్పాట్ల వద్ద ఆర్ అండ్ బి, నేషనల్ హైవే అథారిటీ అధికారులు రక్షణ చర్యలు పూర్తి చేయాలని ఆదేశించారు.
తగ్గిన బ్లాక్ స్పాట్లు..ఎస్పీ శరత్ చంద్ర పవార్
జిల్లా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసు జిల్లా యంత్రాంగం తీసుకున్న ఉమ్మడి చర్యల వల్ల గత 18 నెలల్లో ప్రమాదకరమైన బ్లాక్ స్పాట్ల సంఖ్య 58 నుండి 38కి తగ్గిందని మరణాల సంఖ్య కూడా 7 శాతం మేర తగ్గిందని వివరించారు. అయితే, ఇటీవల కాలంలో మైనర్లు ద్విచక్ర వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పాఠశాలల్లో నిర్వహించే తల్లిదండ్రుల సమావేశాల్లో ఈ అంశంపై విద్యాశాఖ ద్వారా అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్యంగా ముకుందాపురం, మాడుగులపల్లి, నల్గొండ టౌన్, హాలియా, నకరేకల్, దేవరకొండ, చింతపల్లి-మాల్ రహదారులపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేశారు.రహదారి ప్రమాదాల నివారణకు విశేష కృషి చేసిన అధికారులకు, సిబ్బందికి కలెక్టర్, ఎస్పీలు ఈ సందర్భంగా అభినందన పత్రాలను అందజేశారు. ఈ సమావేశంలో పోలీస్, రెవెన్యూ, ఆర్ అండ్ బి, పంచాయతీరాజ్, నేషనల్ హైవేస్, మున్సిపల్ కమిషనర్లు, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి