ప్రజా ఉద్యమాలకు పాటే ప్రాణం: మాగి వెంకన్న
ప్రజా ఉద్యమాలకు పాటే ప్రాణం: మాగి వెంకన్న
Editor Desk
ఖమ్మం: ప్రజా ఉద్యమాలను ముందుకు నడిపించడంలో పాటకు అపారమైన శక్తి ఉందని అసిస్టెంట్ ప్రొఫెసర్ మాగి వెంకన్న అన్నారు. తిరుమలాయపాలెం మండలం హస్నాబాద్ గ్రామంలో నిర్వహించిన అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఖమ్మం జిల్లా 7వ మహాసభలు విజయవంతంగా ముగిశాయి.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నాటి తెలంగాణ సాయుధ పోరాటం నుంచి మలిదశ తెలంగాణ ఉద్యమం వరకు పాట ఉద్యమాలకు ప్రాణం పోసిందన్నారు. ప్రజలను చైతన్యవంతం చేయడంలో ఒగ్గుకథలు, బుర్రకథలు, వీధి నాటకాలతో పాటు పాటలు కీలక పాత్ర పోషించాయని తెలిపారు. దొరల అహంకారాన్ని ఎదిరించడంలో, రైతాంగాన్ని మేల్కొల్పడంలో పాట ప్రధాన ఆయుధంగా నిలిచిందన్నారు.
1974లో ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంగా కామ్రేడ్ కానూరి వెంకటేశ్వరరావు నేతృత్వంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య ఏర్పడి 54 సంవత్సరాలుగా ప్రజా ఉద్యమాలకు సేవలందిస్తున్నదని గుర్తు చేశారు. ఈ ప్రయాణంలో పలువురు కళాకారులు తమ ప్రాణాలను సైతం అర్పించి ఉద్యమాలను నిలబెట్టారని అన్నారు.
నేటి సమాజంలో ప్రజా చైతన్యాన్ని పెంచే పాటలు తగ్గిపోతున్నాయని, పాలకులకు అనుకూలంగా మారుతున్న ధోరణిపై ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో పాటలు ప్రజలను మేల్కొలిపి ఉద్యమాలను బలోపేతం చేశాయని, అలాంటి సాంస్కృతిక సంప్రదాయాలను కొనసాగించాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో అరుణోదయ సాంస్కృతిక సమైక్య రాష్ట్ర, జిల్లా నాయకులు, సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు, స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి