ఆదివాసీ, ట్రాన్స్ జెండర్ విద్యార్థులకు ఫెలోషిప్లు. వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి
ఆదివాసీ, ట్రాన్స్ జెండర్ విద్యార్థులకు ఫెలోషిప్లు. వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి
Editor Desk
హైదరాబాద్, డా. బి.ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ కోర్సులు అభ్యసిస్తున్న ఆదివాసీ, ట్రాన్స్ జెండర్ విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించేందుకు జ్యోతి రెడ్డి ఫౌండేషన్ ముందుకు వచ్చింది. సమతా స్కీమ్ కింద ఫెలోషిప్ల రూపంలో ఈ సహాయం అందించనున్నట్లు వెల్లడించింది.
ఈ మేరకు ఫౌండేషన్ చైర్మన్, యూనివర్సిటీ పూర్వ విద్యార్థి దూదిపాల జ్యోతి రెడ్డి యూనివర్సిటీ వీసీ ప్రొ. ఘంటా చక్రపాణిను కలిసి ప్రతిపాదనలు అందించారు. వరంగల్ జిల్లా మారుమూల గ్రామంలో వ్యవసాయ కూలీగా జీవితం ప్రారంభించిన జ్యోతి రెడ్డి, అనంతరం ఇదే యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసి, అంచెలంచలుగా ఎదిగి అమెరికాలో సాఫ్ట్వేర్ సంస్థను స్థాపించిన విషయం తెలిసిందే.
తనకు జీవితంలో గుర్తింపు ఇచ్చిన విద్యాసంస్థకు తిరిగి సేవ చేయాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు జ్యోతి రెడ్డి తెలిపారు. ఉన్నత విద్యకు దూరంగా ఉన్న ఆదివాసీ, ట్రాన్స్ జెండర్ వర్గాలకు ఆర్థికంగా అండగా నిలవాలనే లక్ష్యంతో ఫెలోషిప్లు అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఈ ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన వీసీ ప్రొ. ఘంటా చక్రపాణి, త్వరలోనే అధికారులతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. పూర్వ విద్యార్థి ముందుకు వచ్చి ఇతరుల విద్యాభివృద్ధికి తోడ్పడడం గర్వకారణమని, ఇది మరెందరికో ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ మేనేజింగ్ డైరెక్టర్ సమ్మి రెడ్డి, రిజిస్ట్రార్ డా. ఎల్.వి.కే. రెడ్డి, అకాడమిక్ డైరెక్టర్ ప్రొ. పుష్పా చక్రపాణి, వీసీ ఓఎస్డీ ప్రొ. రవీంద్రనాథ్ సోలమన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి