భక్తుల భద్రతపై నిర్లక్ష్యం వద్దు – ముందస్తు చర్యలు తీసుకోవాలి : కుమ్మరి రాజు
భక్తుల భద్రతపై నిర్లక్ష్యం వద్దు – ముందస్తు చర్యలు తీసుకోవాలి : కుమ్మరి రాజు
Prabhakar
తెలంగాణలో ప్రసిద్ధి చెందిన సలేశ్వరం లింగమయ్య స్వామి జాతర మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుండగా, భక్తుల భద్రతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నాగర్కర్నూల్ జిల్లా అమ్రాబాద్ టైగర్ రిజర్వ్లో ఏప్రిల్ 1 నుండి 6 వరకు జరిగే ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరుకానున్నారు.ప్రతి సంవత్సరం లాగే ఈసారి కూడా భారీ రద్దీ ఉండే అవకాశం ఉన్నప్పటికీ, తగిన స్థాయిలో భద్రతా ఏర్పాట్లు లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశాలు ఉన్నాయని సామాజిక కార్యకర్త కుమ్మరి రాజు హెచ్చరించారు.అడవి ప్రాంతం కావడం, కఠినమైన ట్రెక్కింగ్ మార్గం ఉండటం, అలాగే సన్నని దారులు కారణంగా భక్తులు ఒకేసారి పెద్ద సంఖ్యలో చేరుతుండటంతో తోపులాటలు జరిగే పరిస్థితులు ఏర్పడుతున్నాయని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, చిన్నారులు, వృద్ధులు ఇలాంటి పరిస్థితుల్లో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు.గతంలో జరిగిన కొన్ని దుర్ఘటనలను గుర్తుచేస్తూ, ఈసారి అలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ముందస్తుగా పటిష్టమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అదేవిధంగా, జాతర సమయంలో కొంతమంది వ్యాపారులు భక్తులను అధిక ధరలకు వస్తువులు అమ్ముతూ దోపిడీ చేస్తున్నారని, ముఖ్యంగా తాగునీటి బాటిళ్లను అధిక ధరలకు విక్రయించడం ఆపాలని కోరారు.
ఈ నేపథ్యంలో, కుమ్మరి రాజు తెలంగాణ సచివాలయంలో దేవాదాయ శాఖ మంత్రి కార్యాలయాన్ని సందర్శించి, ఎం.ఎస్.ఎస్ కార్యదర్శి సోమరాజుకు వినతి పత్రం అందజేశారు.దీనిపై స్పందించిన అధికారులు, సంబంధిత జిల్లా కలెక్టర్ మరియు పోలీస్ అధికారులతో చర్చించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జాతరను సజావుగా నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి