డిజిటల్ విధానంలో జనగణన-2027: ఇండ్ల గణనకు సిద్ధం కావాలి. భారతి హోళీకేరి
డిజిటల్ విధానంలో జనగణన-2027: ఇండ్ల గణనకు సిద్ధం కావాలి. భారతి హోళీకేరి
Editor Desk
యాదాద్రి భువనగిరి: జనగణన-2027 మొదటి విడతలో భాగంగా ఇండ్ల గణన ప్రక్రియను సమర్థవంతంగా నిర్వహించాలని సెన్సస్ డైరెక్టర్ భారతి హోళీకేరి అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్ నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా జనగణన అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇండ్ల గణన ప్రక్రియను ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం సక్రమంగా నిర్వహించాలన్నారు. సాంకేతిక పరిజ్ఞానం వినియోగంపై అవగాహన కలిగి ఉండి, డిజిటల్ విధానంలో గణన చేపట్టాలని సూచించారు. దేశంలో తొలిసారిగా పూర్తిగా డిజిటల్ పద్ధతిలో జనగణన నిర్వహించనున్నట్లు తెలిపారు. మే 11 నుంచి జూన్ 9 వరకు ఇండ్ల గణన కార్యక్రమం కొనసాగుతుందని, ప్రతి కుటుంబానికి సంబంధించిన వివరాలు పూర్తిగా నమోదు చేయాలని పేర్కొన్నారు.
ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్ల నియామకాన్ని మండలాల వారీగా పూర్తి చేసి, ప్రతి 300 ఇళ్లకు లేదా 750-800 జనాభాకు ఒక ఎన్యుమరేటర్ను నియమించాలని సూచించారు. యాప్ నిర్వహణలో సాంకేతిక సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించి గణన ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్లో జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడుతూ, జిల్లాలో ఇండ్ల గణన ప్రక్రియను అధికారులు, సిబ్బంది సమన్వయంతో ఎలాంటి పొరపాట్లు లేకుండా పూర్తి చేస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఆర్డీవో జయమ్మ, జిల్లా జనగణన అధికారి వెంకటరమణ, జిల్లా పంచాయతీ అధికారి విష్ణువర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి