రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి : లక్ష్మిరెడ్డి
రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి : లక్ష్మిరెడ్డి
Editor Desk
రైతాంగం సుదీర్ఘకాలంగా అతివృష్టి, అనావృష్టితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వ్యవసాయం భారంగా మారుతోందని ఏపీ రైతు సంఘం గౌరవాధ్యక్షుడు లక్ష్మిరెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని 104 బసాపురం గ్రామంలో ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో రైతులకు కరపత్రాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఏపీ రైతు సంఘం నియోజకవర్గ గౌరవాధ్యక్షుడు లక్ష్మిరెడ్డి, నియోజకవర్గ కార్యదర్శి బసాపురం గోపాల్ మాట్లాడుతూ ఈ ఏడాది ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో రైతులకు ఎరువులు, విత్తనాలు, వివిధ రకాల వ్యవసాయ పరికరాలను 90 శాతం రాయితీతో అందజేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నకిలీ విత్తనాలు, నకిలీ ఎరువులను అరికట్టడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఏడాది రైతులు నకిలీ విత్తనాలు, ఎరువుల వల్ల నష్టపోతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దురదృష్టకరమన్నారు.
వందలాది టీఎంసీల నీరు సముద్రంలో కలుస్తోందని, ప్రాజెక్టులు నిర్మించి ఆ నీటిని సాగుకు వినియోగించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. విదేశాల్లో జరుగుతున్న యుద్ధాలను సాకుగా చూపుతూ రసాయనిక ఎరువుల ధరలను భారీగా పెంచడం రైతులకు మరింత భారంగా మారిందన్నారు. వెంటనే ఎరువుల ధరలను తగ్గించాలని డిమాండ్ చేశారు.
పంటలకు ఉచిత బీమా సదుపాయం కల్పించి, కౌలు రైతులకు కూడా బీమా వర్తించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. రైతులు పండించిన ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతుకు భరోసా ఇవ్వాలన్నారు.
రైతు భరోసా, పీఎం కిసాన్ నిధులను రూ.50 వేల వరకు పెంచి రైతులకు అందించాలని డిమాండ్ చేశారు. బ్యాంకుల్లో రైతులు తీసుకున్న రుణాల్లో రూ.2 లక్షల వరకు రుణమాఫీ చేయాలని కోరారు.
రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని, రైతుకు వ్యవసాయం భారమైతే దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ప్రతి పాలకుడు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. రైతాంగ సమస్యల పరిష్కారానికి దశలవారీ ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం సీనియర్ నాయకులు గుడిసి ఈరన్న, కరెంటు ఈరన్న, రైతులు, కౌలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి