ప్రభుత్వం చొరవ చూపాలి.. కలెక్టరేట్ ఎదుట మిల్లర్ల ధర్నా.
నల్లగొండ: రైస్ మిల్లర్ల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి పరిశ్రమను ఆదుకోవాలని జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కర్నాటి నారాయణ, ప్రధాన కార్యదర్శి రేపాల భద్రాద్రి రాములు కోరారు. సమస్యల పరిష్కారం కోసం జిల్లా అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. 2014 నుంచి 2025 వరకు ప్రభుత్వం మిల్లర్లకు సుమారు 9 కోట్ల టన్నుల ధాన్యం కేటాయించగా, అందులో 99 శాతం ధాన్యాన్ని బియ్యంగా మార్చి ప్రభుత్వానికి సజావుగా అప్పగించినట్లు తెలిపారు. గత దశాబ్ద కాలంలో తెలంగాణలో ఆధునిక ప్రమాణాలతో వందలాది రైస్ మిల్లులు ఏర్పాటయ్యాయని, వీటి ద్వారా రాష్ట్ర రైతులకు మెరుగైన ధరలు లభించడంతో పాటు తెలంగాణ బియ్యానికి దేశ, అంతర్జాతీయ మార్కెట్లలో ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు.
గత పంటల ధాన్యం నిల్వలు మిల్లుల్లో భారీగా ఉన్నప్పటికీ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు 2025–26 ఖరీఫ్లో 73 లక్షల టన్నులు, రబీ 2025–26లో 81 లక్షల టన్నుల ధాన్యాన్ని మిల్లర్లు దిగుమతి చేసుకుని ప్రభుత్వానికి సహకరించారని తెలిపారు. ఎఫ్సీఐ గోదాముల్లో స్థలాభావం కారణంగా బియ్యం నిల్వలను నెలల తరబడి కాపాడుతూ మిల్లర్లు ఆర్థికంగా నష్టపోయారని పేర్కొన్నారు.
ప్రభుత్వ ధాన్యాన్ని పక్కదారి పట్టించి మోసం చేసిన మిల్లర్లను సంఘం నుంచి బహిష్కరించామని, వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే 2024–25 అనంతరం ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేని మిల్లర్లను పదేపదే వెరిఫికేషన్ పేరుతో ఇబ్బందులకు గురిచేయవద్దని కోరారు.
బకాయిల చెల్లింపునకు అవకాశం ఇవ్వాలి.
2014 నుంచి ప్రభుత్వానికి బకాయి పడిన సుమారు 1,200 మిల్లర్లకు ఆయా సంవత్సరాల కనీస మద్దతు ధర (ఎంఎస్పీ) ప్రకారం బకాయిలను లెక్కించి, రెండు నెలల్లో రెండు విడతలుగా చెల్లించే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. రాబోయే ఖరీఫ్ 2026–27లో ప్రభుత్వానికి ఎలాంటి బకాయిలు లేని మిల్లర్లకే ధాన్యం కేటాయించి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం బియ్యం అప్పగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.రబీ 2022–23 టెండర్ ధాన్యానికి డబ్బులు చెల్లించి ప్రభుత్వానికి సహకరించిన మిల్లర్లపై మార్కెట్ ఫీజు చెల్లించాలంటూ నోటీసులు జారీ చేయడం, రిజిస్ట్రేషన్లు రెన్యూవల్ చేయకపోవడం సరికాదన్నారు. వారికి మార్కెట్ ఫీజు నుంచి మినహాయింపు కల్పించేలా మార్కెటింగ్ శాఖకు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. ధాన్యం అధికంగా వచ్చిన సందర్భాల్లో ఏఎంసీ గోదాముల్లో మిల్లర్లు ఎలాంటి అద్దె లేకుండా నిల్వ చేసుకునేందుకు జిల్లా యంత్రాంగం అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
ధర్నాకు మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మద్దతు తెలిపారు. కార్యక్రమంలో జూలకంటి ఇంద్రారెడ్డి, చిట్టిపోలు యాదగిరి, కండె రామకృష్ణ, తేరేటిపల్లి హనుమంత్, పోల పెద్దయ్య, కన్మంత రెడ్డి కేశవరెడ్డి, తొనుపునూరి వెంకటేశ్వర్లు, సముద్రాల వెంకటేశ్వర్లు, శిల శ్రీనివాస్, వీరుమల్ల శ్రీనివాస్, తేలుకుంట్ల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి