అబ్దుల్లాపూర్మెట్, సెప్టెంబర్ 10 (స్థానికం ప్రతినిధి):
అనుమతులు లేకుండా చేపడుతున్న అక్రమ నిర్మాణాలపై టౌన్ ప్లానింగ్ అధికారులు కొరడా ఝళిపిస్తున్నారు. ప్రభుత్వ నిబంధనలను బేఖాతరు చేస్తూ నిర్మాణాలు చేపడుతున్న వారిపై చర్యలు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఎల్బీనగర్ జోన్ పరిధిలోని హయత్నగర్లో విజయవాడ జాతీయ రహదారికి సమీపంలోని హయత్నగర్–తొర్రూర్ రోడ్డులో సాయిబాబా ఆలయం వెనుక భాగంలో ఎలాంటి అనుమతులు లేకుండా షెడ్డు నిర్మాణం చేపట్టారు. ఈ విషయం టౌన్ ప్లానింగ్ అధికారుల దృష్టికి రావడంతో హయత్నగర్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ ఏసీపీ విజయలక్ష్మి ఆధ్వర్యంలో టీపీఎస్ సోమేష్ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకున్నారు. నిర్మాణాన్ని పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు గుర్తించి అక్రమ షెడ్డును సీజ్ చేశారు.
అదేవిధంగా వనస్థలిపురంలో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న మరో షెడ్డును కూడా అధికారులు సీజ్ చేసినట్లు తెలిపారు.
ప్రభుత్వ ఆదాయానికి గండి
అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపట్టడంవల్ల నిబంధనల ఉల్లంఘనతో పాటు ప్రభుత్వానికి రావాల్సిన నిర్మాణ అనుమతి ఫీజులు, ఇతర రుసుములు కోల్పోయే పరిస్థితి ఏర్పడుతుందని అధికారులు పేర్కొన్నారు. అనధికార నిర్మాణాలు పెరిగితే భవిష్యత్లో ట్రాఫిక్, పార్కింగ్, డ్రైనేజీ, రహదారి విస్తరణ వంటి సమస్యలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉందన్నారు.
అక్రమార్కులను ఉపేక్షించం
ఏసీపీ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేలా, నిబంధనలకు విరుద్ధంగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్న వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని హెచ్చరించారు. అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడితే సీజ్ చేయడంతో పాటు నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. హయత్నగర్ పరిధిలో ఎక్కడైనా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నట్లు గుర్తిస్తే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి