థియేటర్లో ప్రేక్షకుల స్పందన తెలుసుకున్న చిత్ర బృందం
తెలంగాణ పల్లె సంస్కృతి, సంప్రదాయాలు, గ్రామీణ జీవన విధానాన్ని ప్రతిబింబించేలా తెరకెక్కిన ‘మారెమ్మ’ చిత్రానికి ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. చౌటుప్పల్ పట్టణంలో ఈ సినిమా సందడి నెలకొంది. సినిమా ప్రదర్శితమవుతున్న థియేటర్ను చిత్ర బృందం సందర్శించి ప్రేక్షకుల అభిప్రాయాలను నేరుగా తెలుసుకుంది. హీరోయిన్ దీప బాలు, నిర్మాతలు బండారు మయూర్ రెడ్డి, సుభాష్ రెడ్డి, కుషన్ రెడ్డి, సందీప్ రెడ్డిలతో పాటు చిత్ర యూనిట్ సభ్యులు చౌటుప్పల్లోని థియేటర్కు వచ్చి ప్రేక్షకులతో ముచ్చటించారు. కథనం, పాత్రలు, నటీనటుల ప్రదర్శనపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రేక్షకులు స్పందిస్తూ.. గ్రామీణ నేపథ్యం, పల్లె ప్రజల జీవన విధానం, వారి నమ్మకాలు, ఆచార వ్యవహారాలను భావోద్వేగంగా, సహజంగా చూపించిన తీరు తమను ఎంతగానో ఆకట్టుకుందని ప్రశంసించారు.అనంతరం నిర్మాత బండారు మయూర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ పల్లె సంస్కృతిని, గ్రామీణ జీవితంలోని భావోద్వేగాలను ప్రేక్షకులకు చేరువ చేయాలనే ఉద్దేశంతో ఈ చిత్రాన్ని రూపొందించామని తెలిపారు. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఆదరణ తమకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని ఆనందం వ్యక్తం చేశారు. థియేటర్లో చిత్ర యూనిట్ సభ్యులు నేరుగా తమను కలవడం పట్ల అభిమానులు, ప్రేక్షకులు సంతోషం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి