సెక్యూరిటీ దురుసు ప్రవర్తన నుంచి బెడ్ కేటాయింపుపై ఆరోపణల వరకు..
హైదరాబాద్, సెప్టెంబర్ 11
: తెలంగాణలోనే ప్రముఖ ప్రభుత్వ వైద్య సంస్థగా పేరున్న గాంధీ ఆసుపత్రిలో రోగుల ఇబ్బందులు తీరడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అత్యవసర విభాగానికి వచ్చే రోగులతో భద్రతా సిబ్బంది, కొందరు వైద్య సిబ్బంది దురుసుగా వ్యవహరిస్తున్నారని బాధితులు వాపోతున్నారు. నడవలేని రోగులను వీల్చైర్పై ఎక్స్రే, సీటీ స్కాన్ తదితర విభాగాలకు తీసుకెళ్లడం నుంచి తిరిగి వార్డుకు చేర్చే వరకు బంధువులే అన్ని బాధ్యతలు మోయాల్సి వస్తోందని చెబుతున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనూ సిబ్బంది సకాలంలో స్పందించడం లేదని ఆరోపిస్తున్నారు.
ఫోన్లో ఫొటో తీసుకెళ్లాలా?
ఎక్స్రే, సీటీ స్కాన్ పరీక్షల అనంతరం చిత్రాలు, నివేదికలు అందించే విధానంపైనా రోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎక్స్రే ఫిల్మ్లు ఇవ్వకుండా ఫోన్లో చిత్రాన్ని తీసుకెళ్లాలని సూచిస్తున్నారని, సీటీ స్కాన్ చిత్రాలు, నివేదికల విషయంలోనూ ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయని చెబుతున్నారు. స్మార్ట్ఫోన్లు లేని పేదలు, వృద్ధులు, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే రోగులకు ఇది మరింత భారంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు బెడ్ కేటాయింపులోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయని, బెడ్ కోసం డబ్బులు చెల్లించాల్సి వస్తోందంటూ కొందరు బాధితులు చేస్తున్న ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. ఈ ఆరోపణలు వాస్తవమా కాదా అన్నది ఆసుపత్రి అధికారులు సమగ్రంగా విచారించి స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది.
ఆకస్మిక తనిఖీలు చేపట్టాలి
రోగుల పట్ల సిబ్బంది మర్యాదగా వ్యవహరించేలా పర్యవేక్షణ పెంచడంతో పాటు అత్యవసర విభాగాల్లో భద్రతా సిబ్బంది, వార్డు బాయ్లు, నర్సింగ్, సాంకేతిక సిబ్బంది సమన్వయంతో సేవలు అందించాలని ప్రజలు కోరుతున్నారు. ఎక్స్రే, సీటీ స్కాన్ చిత్రాలు, నివేదికలు రోగులకు సక్రమంగా అందేలా స్పష్టమైన విధానం రూపొందించాలని, బెడ్ కేటాయింపుపై వస్తున్న ఆరోపణలపై విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు, గాంధీ ఆసుపత్రి అధికారులు తక్షణమే స్పందించి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి వాస్తవ పరిస్థితిని పరిశీలించాలని కోరుతున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి