VBYLD–2027 క్విజ్లో యువతకు సువర్ణావకాశం.
మై భారత్ కేంద్ర జిల్లా యువజన అధికారి గౌతమ్రెడ్డి
నల్గొండ, సెప్టెంబర్ 9:
దేశాభివృద్ధిలో యువతను భాగస్వాములను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ (VBYLD)–2027లో భాగంగా జాతీయ స్థాయి ఆన్లైన్ క్విజ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు మై భారత్ కేంద్ర జిల్లా యువజన అధికారి గౌతమ్రెడ్డి తెలిపారు. బుధవారం నల్గొండ పట్టణంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
15 నుంచి 29 సంవత్సరాల వయస్సు గల యువత ఈ క్విజ్ పోటీల్లో పాల్గొనవచ్చన్నారు. రాజకీయ నేపథ్యం లేని సుమారు లక్ష మంది ప్రతిభావంతులైన యువతీ యువకులను గుర్తించి, 2047 నాటికి భారతదేశాన్ని సంపూర్ణంగా అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దే ‘వికసిత్ భారత్’ లక్ష్యంలో భాగస్వాములను చేయడమే కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని వివరించారు.తెలుగుతో పాటు దేశంలోని 22 అధికారిక భాషల్లో ఆన్లైన్ క్విజ్ అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎంపిక ప్రక్రియలో భాగంగా క్విజ్, వ్యాసరచన, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో మొత్తం ఐదు దశల్లో పోటీలు జరుగుతాయని చెప్పారు. తుది విజేతలకు న్యూఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి డైలాగ్లో పాల్గొనే అవకాశం లభిస్తుందని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో దేశాభివృద్ధికి సంబంధించిన తమ వినూత్న ఆలోచనలను ప్రదర్శించే అరుదైన అవకాశం దక్కుతుందని గౌతమ్రెడ్డి పేర్కొన్నారు.ఆసక్తి గల యువత సెప్టెంబర్ 30, 2026లోపు ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. యువత తమ ప్రతిభను చాటుకోవడంతో పాటు దేశ భవిష్యత్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.కార్యక్రమంలో మహాత్మాగాంధీ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం కోఆర్డినేటర్ రమణారెడ్డి, నాగార్జున ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ కోటయ్య, కొండ నాయక్, బాబురావు, ప్రసాద్, వెంకటేష్, యూత్ వాలంటీర్ నాగేందర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి