రచయితలు సమాజానికి మార్గదర్శకులు: ప్రొ. ఘంటా చక్రపాణి
రచయితలు సమాజానికి మార్గదర్శకులు: ప్రొ. ఘంటా చక్రపాణి
Editor Desk
రచయితలు సమాజానికి దారి చూపించే మార్గదర్శకులని, వారిని గౌరవించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ఘంటా చక్రపాణి పేర్కొన్నారు. డా. బి. ఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ తెలుగు శాఖ కళల విభాగం ఆధ్వర్యంలో రచయితల సంఘం రజతోత్సవం సందర్భంగా నిర్వహించిన “రైటర్స్ మీట్” కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రచయితలు, ప్రజలు తమ అభిప్రాయాలను స్వేచ్ఛగా వ్యక్తం చేసుకునేందుకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఎల్లప్పుడూ వేదికగా ఉంటుందని తెలిపారు. రచయితలు తమ ఆలోచనలు, భావాలు, అనుభవాలను రచనల రూపంలో వ్యక్తపరచి సామాన్య ప్రజల సమస్యలకు గొంతుకగా మారాలని సూచించారు. రచయితల సంఘం స్థాపనకు 25 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా జరుపుకుంటున్న రజతోత్సవ వేడుకల్లో భాగస్వామ్యం కావడం గౌరవంగా భావిస్తున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న ప్రముఖ రచయిత అల్లం రాజయ్య మాట్లాడుతూ విరసం వంటి ప్రగతిశీల సంస్థల ప్రభావంతోనే డెమోక్రటిక్ స్పేస్ కోసం రైటర్స్ మీట్ వంటి వేదికలు ఏర్పడ్డాయని అన్నారు. గత 25 సంవత్సరాలుగా తెలుగు సాహిత్య వ్యాప్తికి, అధ్యయనానికి ఈ సంస్థ చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.
ప్రస్తుత పరిస్థితుల్లో మాతృభాషకు సంక్షోభ కాలం నడుస్తోందని, దాన్ని అర్థం చేసుకొని భాషను కాపాడేందుకు రచయితలు ముందుకు రావాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి కార్యక్రమాలు యువ రచయితలకు ప్రేరణనిస్తాయని, వారు కూడా సమాజంలోని సామాన్య ప్రజల సమస్యలను ప్రతిబింబించేలా రచనలు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత ఖదీర్ బాబు, ప్రఖ్యాత పాత్రికేయులు డా. కె. శ్రీనివాస్, రచయిత మరియు ‘వీక్షణం’ ఎడిటర్ ఎన్. వేణుగోపాల్, రచయితలు ఎల్.వి. రెడ్డి, కె.ఎన్. మళ్లీశ్వరి, కుప్పిలి పద్మ, బి.ఎస్. రాములు, ఎన్. రజని, వాసిరెడ్డి నవీన్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి