పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి పరీక్ష రాసిన విద్యార్థి
పుట్టెడు దుఃఖాన్ని దిగమింగి పరీక్ష రాసిన విద్యార్థి
Komidala Mahender reddy
తల్లి అంత్యక్రియల ముందు భవిష్యత్తు కోసం పరీక్షకు హాజరు
నల్లగొండ జిల్లా, నార్కట్ పల్లి మండలానికి చెందిన ఓ ఇంటర్ విద్యార్థి జీవితంలో అత్యంత విషాద సమయంలో కూడా ధైర్యం కోల్పోకుండా పరీక్షకు హాజరై అందరినీ కదిలించాడు. కన్నతల్లి మరణించిన దుఃఖంలో ఉన్నప్పటికీ తన భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని పరీక్ష రాసి అనంతరం తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.వివరాల్లోకి వెళ్తే.. నార్కట్పల్లి మండల కేంద్రానికి చెందిన జాల హేమలత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ శుక్రవారం మృతి చెందింది. ఆమె కుమారుడు శివచరణ్ నల్లగొండలోని ఓ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ చదువుతున్నాడు. ప్రస్తుతం జరుగుతున్న వార్షిక పరీక్షలకు నల్లగొండ పట్టణంలో హాజరవుతున్నాడు.
ఇలాంటి సమయంలో తల్లి మరణ వార్తఅతడినితీవ్రంగాకలిచివేసింది. ఒకవైపు కన్నతల్లి అంత్యక్రియలు నిర్వహించాల్సిన బాధ్యత, మరోవైపు భవిష్యత్తును నిర్ణయించే పరీక్ష… ఏది ముందు చేయాలో అర్థంకాని పరిస్థితిలో శివచరణ్ నిలిచిపోయాడు.
అయితే బంధువులు, స్థానికులు అతనికి ధైర్యం చెప్పి ముందుగా జీవితాన్ని నిలబెట్టే పరీక్ష రాయాలని సూచించారు. వారి సలహాతో పుట్టెడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకుని శివచరణ్ పరీక్షా కేంద్రానికి వెళ్లాడు.
కన్నీరు ఆపుకుంటూ, మనసులో తల్లి జ్ఞాపకాలు మెదులుతూనే పరీక్షను రాసి బయటకు వచ్చాడు. అనంతరం నార్కట్పల్లికి చేరుకుని తల్లి అంత్యక్రియల్లో పాల్గొన్నాడు.
ఈ సంఘటనను చూసిన బంధువులు, స్థానికులు శివచరణ్ ధైర్యసాహసాలను కొనియాడుతూ, ఇలాంటి కఠిన పరీక్ష ఎవరికి రాకూడదని భావోద్వేగానికి లోనయ్యారు.జీవితంలో ఎదురైన తీవ్రమైన విషాదాన్ని తట్టుకుని భవిష్యత్తు కోసం ముందడుగు వేసిన శివచరణ్ నిర్ణయం స్థానికంగా అందరినీ కదిలించింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి