ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి: ఎస్ఎఫ్ఐ
ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి: ఎస్ఎఫ్ఐ
K.RAVI
ఎమ్మెల్యే కార్యాలయాన్ని ముట్టడించిన ఎస్ఎఫ్ఐ నాయకులు
రాష్ట్రంలో గత ఆరేళ్లుగా పెండింగ్లో ఉన్న ₹10,500 కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా నాయకులు డిమాండ్ చేశారు. గురువారం యాదాద్రి భువనగిరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చౌటుప్పల్ పట్టణంలోని మునుగోడు శాసనసభ్యుల కార్యాలయాన్ని ఎస్ఎఫ్ఐ నాయకులు ముట్టడించారు. ఎమ్మెల్యే అందుబాటులో లేకపోవడంతో కార్యాలయ గేటుకు వినతిపత్రం అందజేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వేముల నాగరాజు, లావుడియా రాజు మాట్లాడుతూ... స్కాలర్షిప్లు రాక పేద, మధ్యతరగతి విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలోకి నెట్టబడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజుల కోసం విద్యార్థులపై ఒత్తిడి తెస్తున్నాయని, కోర్సులు పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే పెండింగ్ బకాయిలు విడుదల చేస్తామని ఇచ్చిన హామీ నీటిమూటగా మారిందని విమర్శించారు. జీవో నంబర్లు 7, 8ల ద్వారా వైఎస్సార్ హయాంలో తెచ్చిన స్కాలర్షిప్ పథకానికి గండి కొట్టే కుట్ర జరుగుతోందని ఆరోపించారు. తక్షణమే పెండింగ్ స్కాలర్షిప్ నిధులను విడుదల చేయాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ప్రజాప్రతినిధులను గ్రామాల్లో తిరగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యురాలు ఇందురాణి, జిల్లా ఉపాధ్యక్షుడు ఇర్ల రాహుల్, సహాయ కార్యదర్శులు తిగుళ్ల శ్రీనివాస్, పుట్టల ఉదయ్, సృజన, జిల్లా కమిటీ సభ్యులు ప్రకాష్, ప్రసన్న, అరవింద్, నాయకులు సాయి, మల్లేశ్, మధు, చరణ్, వరుణ్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి