Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 13, 2026 10:50 PM

పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ అమలు.. జిరాక్స్ సెంటర్లు మూసివేత. ఎస్పీ శరత్ చంద్ర పవర్

పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ అమలు.. జిరాక్స్ సెంటర్లు మూసివేత. ఎస్పీ శరత్ చంద్ర పవర్

పరీక్ష కేంద్రాల వద్ద 163 బీఎన్ఎస్ఎస్ అమలు.. జిరాక్స్ సెంటర్లు మూసివేత. ఎస్పీ శరత్ చంద్ర పవర్
March 13, 2026 08:57 PM 20 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

పది పరీక్షలకు కట్టుదిట్టమైన బందోబస్తు

జిల్లాలో శనివారం నుంచి ప్రారంభమయ్యే పదవ తరగతి వార్షిక పరీక్షలను ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టింది. ఏప్రిల్ 16 వరకు కొనసాగే పరీక్షల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులకు, సిబ్బందికి ప్రత్యేక ఆదేశాలు జారీ చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు.

పరీక్షా కేంద్రాల పరిసరాల్లో ప్రజలు గుమిగూడకుండా ఉండేందుకు కేంద్రాల నుంచి 500 మీటర్ల పరిధిలో సెక్షన్ 163 బీఎన్ఎస్ఎస్ (పాత 144 సెక్షన్) అమలు చేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. నిబంధనలు ఉల్లంఘించి గుంపులుగా చేరితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

పరీక్షల సమయంలో కేంద్రాల సమీపంలోని జిరాక్స్ సెంటర్లు, ఇంటర్నెట్ షాపులు, ఫోటోకాపీ దుకాణాలను తప్పనిసరిగా మూసివేయాలని ఆదేశించారు. ప్రశ్నాపత్రాల లీకేజీ, కాపీయింగ్ వంటి అక్రమాలకు తావులేకుండా ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అలాగే పరీక్షా కేంద్రాల వద్ద లౌడ్‌స్పీకర్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు.

విద్యార్థులు హాల్ టికెట్‌లో సూచించిన సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని ఎస్పీ సూచించారు. పరీక్షా హాల్లోకి సెల్ ఫోన్లు, ట్యాబ్‌లు, బ్లూటూత్ పరికరాలు, ఎలక్ట్రానిక్ వాచ్‌లు, కాలిక్యులేటర్లు, వాలెట్లు వంటి వస్తువులను అనుమతించబోమని స్పష్టం చేశారు.

పరీక్షా కేంద్రాల వద్ద స్థిర బందోబస్తుతో పాటు మొబైల్ పెట్రోలింగ్ వాహనాల ద్వారా నిరంతరం పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే విచారణ చేపడతామని పేర్కొన్నారు. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ వెల్లడించారు. రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరిస్తారని తెలిపారు.

పరీక్షల నిర్వహణలో ఏవైనా అక్రమాలు లేదా అనుమానాస్పద చర్యలు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News