ప్రాణాలను నిలబెట్టే 'గోల్డెన్ అవర్'పై అవగాహన
ప్రాణాలను నిలబెట్టే 'గోల్డెన్ అవర్'పై అవగాహన
K.RAVI
- రోడ్డు ప్రమాద సమయాల్లో తక్షణ స్పందన అవసరం
- 'అరైవ్ అలైవ్'లో భాగంగా పోలీసుల ఆధ్వర్యంలో శిక్షణ
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్ క్యాంపెయిన్-2026’ కార్యక్రమంలో భాగంగా యాదాద్రి జిల్లా రోడ్డు భద్రత వారోత్సవాలు ఐదో రోజుకు చేరుకున్నాయి. శుక్రవారం చౌటుప్పల్ ఇన్స్పెక్టర్ జి. మన్మధ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ‘గోల్డెన్ అవర్ ట్రైనింగ్’ కార్యక్రమాన్ని నిర్వహించారు. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు క్షతగాత్రులను ఎలా కాపాడుకోవాలనే అంశంపై డాక్టర్లు, అంబులెన్స్ డ్రైవర్లు, వాలంటీర్లకు ప్రత్యక్షంగా అవగాహన కల్పించారు.
మొదటి గంట అత్యంత కీలకం:
ఈ సందర్భంగా ఇన్స్పెక్టర్ మన్మధ కుమార్ మాట్లాడుతూ.. రోడ్డు ప్రమాదం జరిగిన మొదటి గంటను ‘గోల్డెన్ అవర్’ గా పరిగణిస్తారని, ఈ సమయంలో బాధితులకు సరైన ప్రాథమిక చికిత్స అందించి ఆసుపత్రికి తరలిస్తే ప్రాణాపాయం నుంచి తప్పించవచ్చని పేర్కొన్నారు. ప్రమాద సమయంలో ప్రజలు భయపడకుండా తక్షణమే స్పందించాలని కోరారు.
ప్రథమ చికిత్స: ప్రమాద స్థలంలో బాధితులను సురక్షితంగా వాహనాల నుంచి బయటకు తీయడం, రక్తస్రావం కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై శిక్షణ ఇచ్చారు. ప్రమాదం జరిగిన వెంటనే 100 లేదా 112 ఎమర్జెన్సీ నంబర్లకు కాల్ చేసి సమాచారం అందించాలని సూచించారు.
బాధితులను అంబులెన్స్లోకి తరలించేటప్పుడు వెన్నెముక, మెడ భాగాలకు గాయాలు కాకుండా పాటించాల్సిన మెళకువలను వివరించారు.ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ ఎస్ఐ ఉపేందర్ రెడ్డి, పోలీసు సిబ్బంది,ఆసుపత్రి వైద్యులు, అంబులెన్స్ డ్రైవర్లు, వాలంటీర్లు, ఆశా వర్కర్లు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి