ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలి..మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
ప్రజాప్రతినిధులు అధికారులు సమన్వయంతో పనిచేయాలి..మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి..
స్థానికం బృందం
అప్పుడే పేదల అభివృద్ధి సంక్షేమం సాధ్యం..
మున్సిపల్ కౌన్సిలర్ల శిక్షణ
రూ. 10,400 కోట్లతో విజయవాడ హైవే విస్తరణ పనులు..
ప్రజా ప్రతినిధులు, అధికారులు సమన్వయంతో పనిచేసినప్పుడే పేదల అభివృద్ధి, సంక్షేమం సాధ్యమవుతుందని రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. 'ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక' 99 రోజుల కార్యాచరణలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో నూతనంగా ఎన్నికైన కార్పొరేటర్లు, మున్సిపల్ కౌన్సిలర్లకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నూతనంగా ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులపై గురుతర బాధ్యత ఉందన్నారు. ప్రజలతో మమేకమై వారి సమస్యలను పరిష్కరించినప్పుడే మన్ననలు లభిస్తాయని పేర్కొన్నారు. మున్సిపాలిటీల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని బడ్జెట్ సమావేశాలు నిర్వహించి ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగాలని సూచించారు. వేసవి దృష్ట్యా తాగునీటి ఎద్దడి రాకుండా చూడాలని రాజకీయాలకు అతీతంగా అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
రూ. 10,400 కోట్లతో హైవే పనులు..
జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులను వివరిస్తూ.. రూ. 10,400 కోట్లతో హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు టెండర్లు పిలిచినట్లు మంత్రి వెల్లడించారు. అలాగే నల్గొండ నుంచి ధర్వేశిపురం వరకు రూ. 320 కోట్లతో రహదారి విస్తరణ, మాల్ - హైదరాబాద్ లైన్ పనులు త్వరలోనే చేపట్టనున్నట్లు తెలిపారు. జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ మాట్లాడుతూ.. 99 రోజుల కార్యాచరణను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. ఉగాది పండుగ నాటికి సామూహిక ఇందిరమ్మ గృహప్రవేశాల కార్యక్రమానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. మున్సిపల్ సమస్యలను నేరుగా తన దృష్టికి తీసుకురావచ్చని ప్రజావాణి అర్జీల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తామని తెలిపారు.
స్మార్ట్ సిటీగా నల్గొండ.
నల్గొండను స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ శంకర్ నాయక్ మాట్లాడుతూ కౌన్సిలర్లు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై పూర్తి అవగాహన పెంచుకున్నప్పుడే ప్రజలకు మేలు జరుగుతుందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు.ఈ కార్యక్రమంలో మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, ఆర్డీవో అశోక్ రెడ్డి, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూపూడి రమేష్, వివిధ మున్సిపాలిటీల కమిషనర్లు, కౌన్సిలర్లు పాల్గొన్నారు. వివిధ శాఖల అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి