ప్రైవేట్ స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి అధిక ఫీజులు, పుస్తకాల విక్రయాలపై చర్యలు కోరిన బీసీ విద్యార్థి సంఘం
ప్రైవేట్ స్కూళ్ల దోపిడీకి అడ్డుకట్ట వేయాలి అధిక ఫీజులు, పుస్తకాల విక్రయాలపై చర్యలు కోరిన బీసీ విద్యార్థి సంఘం
Editor Desk
భువనగిరి: ప్రైవేట్ పాఠశాలల పేరుతో విద్యార్థులు, తల్లిదండ్రులపై జరుగుతున్న ఫీజులు, పుస్తకాల దోపిడీని వెంటనే అరికట్టాలని బీసీ విద్యార్థి సంఘం రాష్ట్ర కన్వీనర్ పల్లగొర్ల మోదీరాందేవ్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా డీఈవో బిక్షపతికి వినతిపత్రం అందజేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, బుక్ ఫీజు, బస్సు ఫీజు, ట్యూషన్ ఫీజు, డొనేషన్ పేర్లతో ప్రైవేట్ విద్యాసంస్థలు తల్లిదండ్రులను ఆర్థికంగా దోచుకుంటున్నాయని ఆరోపించారు.
పాఠశాలల్లో పుస్తకాల విక్రయాన్ని నిషేధించినప్పటికీ అనేక సంస్థలు నిబంధనలను బేఖాతరు చేస్తూ సొమ్ము చేసుకుంటున్నాయని విమర్శించారు. అధిక ఫీజులు వసూలు చేస్తున్న, అనుమతులు లేని, భవన భద్రత, ఫైర్ సేఫ్టీ, శానిటేషన్ ప్రమాణాలు పాటించని పాఠశాలలను గుర్తించి సీజ్ చేయాలని కోరారు. టెట్ అర్హత లేని ఉపాధ్యాయులను తొలగించడంతో పాటు ఫిట్నెస్ లేని స్కూల్ బస్సులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు వెళ్లే విద్యార్థులకు టీసీల విషయంలో ఇబ్బందులు కల్పిస్తున్న ప్రైవేట్ పాఠశాలలపై చర్యలు తీసుకోవాలని, ఫీజు నియంత్రణ చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. అనంతరం డీఈవోను సన్మానించారు.
ఈ కార్యక్రమంలో సామాజిక కార్యకర్త నిమ్మల వీరన్న, ఎడ్ల మహాలింగం, ధరావత్ గిరిధర్, సందీప్, రాకేష్, అజయ్, అఖిల్, యుగంధర్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి