ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల భారీ నిరసన
ప్రైవేట్ బస్సు ఆపరేటర్ల భారీ నిరసన
RAPOLU LINGASWAMY
తెలంగాణ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్ ఓనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు బుధవారం ఖైరతాబాద్ ఆర్టీఓ కార్యాలయం ఎదుట భారీ నిరసన చేపట్టారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన ఆపరేటర్లు కార్యాలయాన్ని ముట్టడించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ నినాదాలు చేశారు.
రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి వచ్చిన బస్సు యజమానులు, ఆపరేటర్లు ఈ ఆందోళనలో పాల్గొన్నారు. పోరాటానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఆపరేటర్కు అసోసియేషన్ ప్రతినిధులు కృతజ్ఞతలు తెలిపారు. ప్రైవేట్ బస్సు రంగం ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరారు.
ఆరు ప్రధాన డిమాండ్లు
సింగిల్ డిస్ట్రిక్ట్ పర్మిట్ కొనసాగింపు: తాత్కాలిక పర్మిట్ (టీపీ) విధానాన్ని ఎలాంటి మార్పులు లేకుండా యథావిధిగా కొనసాగించాలి.
జీవో-16 రద్దు: రేడియం స్టిక్కర్లు, పీఆర్ కోడ్ అమలును వెంటనే రద్దు చేయాలి.
అంతర్రాష్ట్ర అగ్రిమెంట్లు: గత 12 ఏళ్లుగా పెండింగ్లో ఉన్న పొరుగు రాష్ట్రాల ఒప్పందాలను తక్షణమే పూర్తి చేయాలి.
గ్రీన్ టాక్స్ తగ్గింపు: ప్రైవేట్ వాహనాలపై విధిస్తున్న అధిక గ్రీన్ టాక్స్ను తగ్గించాలి.
ప్రత్యేక బోర్డు ఏర్పాటు: ప్రైవేట్ బస్సు రంగ అభివృద్ధి, సంక్షేమం కోసం ప్రత్యేక బోర్డు ఏర్పాటు చేసి ప్రత్యేక నిధులు కేటాయించాలి.
ఆల్ తెలంగాణ పర్మిట్: రాష్ట్రవ్యాప్తంగా ఎలాంటి ఆంక్షలు లేకుండా బస్సులు నడిపేందుకు ఆల్ తెలంగాణ పర్మిట్ విధానాన్ని అమలు చేయాలి.పోరాటం కొనసాగిస్తాం
డిమాండ్లు నెరవేరే వరకు తమ ఆందోళన కొనసాగుతుందని ఆపరేటర్లు హెచ్చరించారు. ప్రైవేట్ బస్సు రంగంపై ఆధారపడి జీవిస్తున్న వేలాది కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోరారు.
రవాణా శాఖ అధికారులు చర్చలకు ముందుకు రాకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామని అసోసియేషన్ నాయకులు స్పష్టం చేశారు. ప్రైవేట్ రవాణా రంగాన్ని కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని
వారు డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి