పరీక్షల సాధనకు ‘రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్’ యాప్ ఆవిష్కరణ..
పరీక్షల సాధనకు ‘రాకేష్ రెడ్డి ఈ-క్లాసెస్’ యాప్ ఆవిష్కరణ..
NM Yadav
ప్రభుత్వాలపై ప్రజల విముఖతకు నిదర్శనమే 'కాక్రోచ్' యాప్ విజయాలు..
రాష్ట్ర అవతరణ వేడుకలను 10 నిమిషాల్లో ముగించిన దౌర్భాగ్య స్థితిలో సీఎం..
పవన్ కల్యాణ్ వి అన్నీ సినిమా డైలాగులు, డ్రామాలు... మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ధ్వజం
నల్గొండ : వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న నిరుద్యోగ యువతకు అన్ని రకాల కోర్సులు, పరీక్షల సమాచారం ఒకే చోట లభించేలా రూపొందించిన ‘RAKESH REDDY E-CLASSES’ మొబైల్ యాప్ను మంగళవారం నల్గొండ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఘనంగా ప్రారంభించారు. బిఆర్ఎస్ యువ నాయకుడు రాకేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్ర కుమార్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్లతో పాటు పలువురు ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాప్ను ఆవిష్కరించిన అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జగదీష్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంపై, సీఎం రేవంత్ రెడ్డిపై, అలాగే జనసేన అధినేత పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
కేసీఆర్ హయాంలోనే ఉద్యోగాల కల్పన, సాగు విప్లవం..
జగదీష్ రెడ్డి మాట్లాడుతూ.. "పోటీ పరీక్షల అభ్యర్థుల కోసం ఒకే వేదికపై అన్ని పరిష్కారాలు దొరికేలా ఈ యాప్ను తీసుకురావడం అభినందనీయం. ప్రస్తుతం 'కాక్రోచ్' లాంటి యాప్లకు కేవలం 15 రోజుల్లోనే 15 కోట్ల మంది ఫాలోవర్స్ వస్తున్నారంటే, అది ప్రస్తుత ప్రభుత్వాల పట్ల ప్రజల్లో ఉన్న తీవ్ర వ్యతిరేకతకు విముఖతకు అద్దం పడుతోంది" అని వ్యాఖ్యానించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ ఘనతలను గుర్తు చేస్తూ కేసీఆర్ అద్భుతమైన పాలనతో ప్రత్యక్షంగా, పరోక్షంగా కోటి ఉద్యోగాలను సృష్టించారని ఆయన పేర్కొన్నారు. ఒక్క విద్యుత్ శాఖలోనే తాము 30 వేల ఉద్యోగాలు భర్తీ చేశామని, దేశంలోనే అత్యుత్తమ పారిశ్రామిక విధానం (TS-iPASS) ద్వారా కేసీఆర్ 20 లక్షల మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పించారని గుర్తు చేశారు.
సాగుభూమి, జీఎస్డీపీలో రికార్డులు..
తెలంగాణ ఏర్పడే నాటికి రాష్ట్రంలో సాగుభూమి 1.20 కోట్ల ఎకరాలు మాత్రమే ఉండేది. కానీ కేవలం మూడేళ్లలోనే అదనంగా మరో కోటి ఎకరాలను సాగులోకి తెచ్చి, మొత్తం సాగుభూమిని 2.10 కోట్ల ఎకరాలకు చేర్చిన ఘనత కేసీఆర్ది. దీనివల్ల పరోక్షంగా మరో 50 లక్షల మందికి ఉపాధి లభించింది. కేసీఆర్ హయాంలో రాష్ట్ర జీఎస్డీపీ ₹3 లక్షల కోట్ల నుంచి ఏకంగా ₹15 లక్షల కోట్లకు చేరిందని గణాంకాలను వివరించారు.
పది నిమిషాలు కూడా ప్రసంగించలేని అజ్ఞానంలో సీఎం!
రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల నిర్వహణపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై జగదీష్ రెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. ఇవాళ రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి పది నిమిషాలు కూడా సరిగ్గా ప్రసంగించలేని దౌర్భాగ్య పరిస్థితి ఉంది. ఇది సీఎం అజ్ఞానానికి నిదర్శనం కరెంట్, తాగునీరు అద్భుతంగా ఇచ్చి, కృష్ణా-గోదావరి నీళ్లను ప్రతి ఇంటికీ సురక్షితంగా సరఫరా చేసిన కేసీఆర్ చరిత్రను తట్టుకోలేకనే ఆయన మాట్లాడలేకపోయారు. సీఎంకు అసలు 'జై తెలంగాణ' అనడమే ఇష్టం లేదు. ఆయనకు రాష్ట్రంపై ప్రేమ లేదు. రాబోయే రోజుల్లో తనకు మళ్లీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ లేదని రేవంత్ రెడ్డికి ముందే అర్థమైపోయిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికీ గుజరాత్లో కేవలం ఆరు గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నారని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కేసీఆర్దేనని స్పష్టం చేశారు. ఇవాళ రాష్ట్ర అవతరణ దినోత్సవంలో కేవలం ఎండ కొడుతుందనే నెపంతో 10 నిమిషాల్లోనే కార్యక్రమం ముగించుకుని వెళ్లిపోయిన రేవంత్ రెడ్డి ఒక దుర్మార్గుడని, రాష్ట్రాన్ని ఎలాంటి మూర్ఖుల చేతిలో పెట్టామో ప్రజలు అర్థం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ప్రపంచమంతా చూసి నేర్చుకునేలా కేసీఆర్ పాలన సాగించారని కొనియాడారు.
పవన్ కల్యాణ్ వి గాలి మాటలు మోదీ రాసిచ్చిన స్క్రిప్ట్.!
జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై జగదీష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. పవన్ కల్యాణ్ ఏదో శూన్యంలో మాట్లాడుతున్నారు. అన్నీ సినిమా డైలాగులు కొడుతున్నారు తప్ప, ఆయన్ను ఎవరు అడ్డుకున్నారు? ఎవరు ఏమన్నారు? అనే విషయాలు పేర్లు చెప్పడం లేదు. ఇలా గాల్లో మాట్లాడటం సరికాదు. తెలంగాణ ప్రజల భిక్షతోనే ఆయన బాగుపడ్డారు. ఇక్కడే ఉండి ఆస్తులు కూడబెట్టుకున్నారు, ఇక్కడే ఓనమాలు నేర్చుకున్నారు. మళ్లీ ఇక్కడికే వచ్చి ఏవేవో మాట్లాడటం కేవలం ఒక డ్రామా, ట్రాష్ అని కొట్టిపారేశారు. రాష్ట్రంలో ఉన్న అసలు సమస్యలను పక్కదారి పట్టించేందుకే ఈ నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. గతంలో ఇక్కడ పోటీ చేసినప్పుడు ఎన్ని ఓట్లు వచ్చాయో పవన్ గుర్తుంచుకోవాలన్నారు. మళ్లీ ఇప్పుడు వస్తా, పొడుస్తా అంటే ఇక్కడ ఎవ్వరూ నమ్మరు. ప్రధాని మోదీ రాసిచ్చిన స్క్రిప్ట్ను పవన్ చదువుతున్నారు. తెలంగాణ ఏర్పాటును పార్లమెంట్లో అవహేళన చేసిన మోడీ, నువ్వు మాకు ఒక్కటే. నువ్వు కూడా మోడీ ఏజెంట్వే అని మాకు అనిపిస్తోంది. తస్మత్ జాగ్రత్త.. తెలంగాణ గురించి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అని జగదీష్ రెడ్డి గట్టిగా హెచ్చరించారు. ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సాగే పోరాటాల్లో యువత, నిరుద్యోగులు ఎప్పుడూ ముందుండాలని ఆయన ఈ సందర్భంగా ఆకాంక్షించారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి