పల్లె ప్రగతిపై కలెక్టర్ ‘సుడిగాలి’ పర్యటన..
పల్లె ప్రగతిపై కలెక్టర్ ‘సుడిగాలి’ పర్యటన..
NM Yadav
నర్సరీలు, ఉపాధి పనులు పరిశీలించిన కలెక్టర్ చంద్రశేఖర్..
స్కూళ్లలో కట్టెల పొయ్యిపై వంట వద్దు.. గ్యాస్ వాడాల్సిందే..
నకిరేకల్ : పల్లెల్లో ప్రభుత్వ పథకాల అమలు తీరు, అభివృద్ధి పనుల నాణ్యతపై జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ బుధవారం సుడిగాలి పర్యటన చేశారు. శాలిగౌరారం మండలంలోని వల్లాల, అడ్లూరు గ్రామాల్లో పర్యటించిన ఆయన నర్సరీల నుంచి అంగన్వాడీ కేంద్రాల వరకు క్షేత్రస్థాయిలో తనిఖీలు చేపట్టారు. ఉపాధి కూలీలకు సౌకర్యాలు కల్పించడంలో నిర్లక్ష్యం వహించవద్దని అధికారులను ఆదేశించారు. ముందుగా వల్లాల గ్రామంలోని వనమహోత్సవం నర్సరీని కలెక్టర్ సందర్శించారు. రానున్న వర్షాకాలంలో నాటాల్సిన 13,800 మొక్కల లక్ష్యంపై ఏపీఎం, ఏపీవోలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గ్రామసభలు నిర్వహించి ప్రజల అభిప్రాయం మేరకు అవసరమైన మొక్కలను పెంచాలని నాటాల్సిన స్థలాలను ముందే గుర్తించి జియో ట్యాగింగ్ చేయాలని సూచించారు. అనంతరం పల్లె ప్రకృతి వనాన్ని పరిశీలించి గ్రామస్థుల వాకింగ్ కోసం అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు.
ఉపాధి హామీ కూలీలకు నీడ, తాగునీరు కచ్చితంగా ఏర్పాటు చేయాలి..
వల్లాల చెరువులో ఉపాధి హామీ కింద జరుగుతున్న ఫిష్ పాండ్ తవ్వకం పనులను కలెక్టర్ తనిఖీ చేశారు. ఎండల దృష్ట్యా కూలీలు పడుతున్న ఇబ్బందులను గమనించిన ఆయన పని ప్రదేశంలో కచ్చితంగా తాగునీరు, నీడ సౌకర్యం కల్పించాలని డీఆర్డీఓ శేఖర్ రెడ్డిని ఆదేశించారు. ఎక్కువ పని చేస్తేనే ఎక్కువ వేతనం వస్తుంది ఉదయాన్నే పనులకు వచ్చి ఎండ ముదరకముందే పూర్తి చేసుకోవాలని కూలీలకు సూచించారు. గ్రామంలో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లు, పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులను తనిఖీ చేశారు.
మోడల్ స్కూల్లో కట్టెల పొయ్యిపై ఆగ్రహం..
తెలంగాణ మోడల్ స్కూల్ను సందర్శించిన కలెక్టర్ అక్కడ విద్యార్థులకు కట్టెల పొయ్యిపై వంట వండుతుండటం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్షణమే కట్టెల వాడకం నిలిపివేసి గ్యాస్ వాడాలని ప్రిన్సిపల్ కృష్ణమోహన్ను ఆదేశించారు. పాఠశాలలోని ఆర్ఓ ప్లాంట్ మరమ్మతులు చేయించాలని, డ్యూయల్ డెస్క్లను అందుబాటులోకి తేవాలని స్పష్టం చేశారు. పీఎం శ్రీ కింద ఎంపికైనందున పాఠశాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలని సూచించారు.
అంగన్వాడీ భవనాలు పూర్తి చేయాలి
అడ్లూరు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రాన్ని సందర్శించి గర్భిణులు, బాలింతలకు అందుతున్న పౌష్టికాహారంపై ఆరా తీశారు. అద్దె భవనాల్లో ఉన్న కేంద్రాలకు ఎన్ఆర్ఈజీఎస్ కింద మంజూరైన సొంత భవనాల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామంలో ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లు, మిషన్ భగీరథ నీటి సమస్యలను సర్పంచ్ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా వాటి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ పర్యటనలో ఎంపీడీఓ జ్యోతిలక్ష్మి, తహసీల్దార్ వరప్రసాద్, ఎంఈఓ సైదులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి