నల్లి పురుగుతో మామిడి తోటలకు భారీ నష్టం – రైతుల దుస్థితి పై కిసాన్ మహాసభ ఆందోళన
నల్లి పురుగుతో మామిడి తోటలకు భారీ నష్టం – రైతుల దుస్థితి పై కిసాన్ మహాసభ ఆందోళన
GADDAM JAGANMOHAN REDDY
తిరువూరు నియోజకవర్గంలోని ఏ.కొండూరు మండలం పడమర మాధవరం, రేపూడి గ్రామాల్లో నల్లి పురుగు కారణంగా నష్టపోయిన మామిడి తోటలను అఖిల భారత కిసాన్ మహాసభ బృందం పరిశీలించింది. బాధిత రైతులను కలిసి పంట నష్టంపై వివరాలు సేకరించింది.
ఈ సందర్భంగా అఖిల భారత కిసాన్ మహాసభ రాష్ట్ర కార్యదర్శి డి.హరినాథ్ మాట్లాడుతూ రాష్ట్రంలోనే కాక దేశవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు పొందిన నూజివీడు ప్రాంత మామిడి రైతులు ప్రస్తుతం తీవ్రమైన సంక్షోభంలో ఉన్నారని విమర్శించారు. రైతుల సమస్యలను పట్టించుకునే వారు లేరని ఆవేదన వ్యక్తం చేశారు.
కృష్ణా, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, విజయనగరం, కడప, కర్నూలు, నెల్లూరు, నంద్యాల, చిత్తూరు జిల్లాల్లో లక్షల ఎకరాల్లో మామిడి ప్రధాన పంటగా సాగు జరుగుతుందని తెలిపారు. ముఖ్యంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో సుమారు లక్షా యాభై వేల ఎకరాల్లో మామిడి సాగు జరుగుతోందన్నారు.
గత మూడు సంవత్సరాలుగా నల్లి పురుగు, ముడ్డి పుచ్చిపోవడం వంటి సమస్యల కారణంగా రైతులు కోట్ల రూపాయల నష్టాన్ని ఎదుర్కొంటున్నారని హరినాథ్ తెలిపారు. తీవ్ర నష్టాలతో కొంతమంది రైతులు ఆత్మహత్యల దిశగా వెళ్లే పరిస్థితులు ఏర్పడ్డాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన రైతులు మామిడి తోటలను నరికివేసి పామాయిల్, మొక్కజొన్న వంటి పంటలు వేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.
మామిడి రైతుల దుస్థితిని రాష్ట్ర ప్రభుత్వం గమనించి ఎకరానికి రూ.లక్ష నష్టపరిహారం ఇవ్వాలని, వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు మరియు ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టమైన హామీ ఇవ్వాలని హరినాథ్ డిమాండ్ చేశారు.
మామిడి పంటకు వచ్చే తెగుళ్ల నివారణపై ముందస్తు హెచ్చరికలు ఇవ్వడంలో మామిడి పరిశోధనా సంస్థ శాస్త్రవేత్తలు గానీ, వ్యవసాయ శాఖ అధికారులు గానీ సరైన చర్యలు తీసుకోవడం లేదని రైతు భూక్యా హరిచంద్ ఆరోపించారు. దీనివల్ల రైతులు తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని తెలిపారు.
పంటల బీమా పథకం నిర్వీర్యంగా మారిందని రైతు నాయకుడు భరోత్ పీక్లా నాయక్ విమర్శించారు. ప్రభుత్వం సకాలంలో బీమా చెల్లింపులు చేయకపోవడంతో రైతులు ఎటువంటి నష్టపరిహారం పొందలేకపోతున్నారని చెప్పారు.
ఈ సందర్భంగా పోరళ్ళ గోవిందు మాట్లాడుతూ ఈ ప్రాంతంలో మిర్చి, పొగాకు, మామిడి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు తక్షణ సహాయం అందించాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి