నల్లగొండ ప్రజల ప్రాణాలతో రాజకీయాలు వద్దు: కైలాష్ నేత ఆగ్రహం
నల్లగొండ ప్రజల ప్రాణాలతో రాజకీయాలు వద్దు: కైలాష్ నేత ఆగ్రహం
స్థానికం బృందం
మూసి ప్రక్షాళన అంశంపై బీఆర్ఎస్ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ నల్లగొండ డీసీసీ అధ్యక్షుడు పున్న కైలాష్ నేత మండిపడ్డారు. గాంధీ భవన్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ను “బ్రోకర్ల రాష్ట్ర సమితి”గా అభివర్ణించారు. నల్లగొండ ప్రజలు ఫ్లోరోసిస్ వ్యాధులతో తీవ్రంగా బాధపడుతున్న సమయంలో బీఆర్ఎస్ నేతలు బాధ్యతారాహిత్య వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు.
నల్లగొండ జిల్లాలో సుమారు 45 లక్షల మంది ప్రజలు ఫ్లోరోసిస్ సమస్యతో ఇబ్బందులు పడుతుంటే, బీఆర్ఎస్ నేతలు సమస్య పరిష్కారంపై దృష్టి పెట్టకుండా రాజకీయ విమర్శలకే పరిమితమవుతున్నారని ఆయన ఆరోపించారు. కేటీఆర్ వ్యాఖ్యలను అనుసరిస్తూ హరీష్ రావు కూడా అదే దారిలో నడుస్తున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్, బీజేపీ పార్టీల్లో ఉన్న నాయకులు నల్లగొండ జిల్లాను అభివృద్ధి నుంచి దూరం చేయాలని చూస్తున్నారని కైలాష్ నేత అన్నారు. మూసి నది కాలుష్యం కారణంగా నల్లగొండ జిల్లా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఈ సమస్య నుంచి ప్రజలకు విముక్తి కలిగించేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు.
ఎలాంటి రాజకీయ లాభాపేక్ష లేకుండా సీఎం రేవంత్ రెడ్డి మూసి ప్రక్షాళనకు ముందుకు వచ్చారని ఆయన పేర్కొన్నారు. రైతులు, ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలకు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మద్దతు ఇస్తుందని కైలాష్ నేత స్పష్టం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి