నల్లగొండలో ఆటో కార్మికుల కన్నీటి రోధనకలెక్టర్ కి వినతి..
నల్లగొండలో ఆటో కార్మికుల కన్నీటి రోధనకలెక్టర్ కి వినతి..
NM Yadav
ఉచిత బస్సు పథకం దెబ్బ బైక్ టాక్సీల ముప్పు..
పెరిగిన డీజిల్, గ్యాస్ ఖర్చులు.. కనీస ఛార్జీ రూ.30 చేయాలని డిమాండ్..
పరిష్కరించకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని ఆటో జేఏసీ హెచ్చరిక..
నల్లగొండ : మా పొట్ట కొట్టొద్దు సార్.. మా కుటుంబాలను రోడ్డున పడేయొద్దు.. ఉదయం నుంచి రాత్రి దాకా తిరిగినా కనీసం డీజిల్, గ్యాస్ ఖర్చులు కూడా రావడం లేదు. ఇంటికెళ్లి పిల్లల ముఖాలు చూడాలంటేనే భయమేస్తోంది అంటూ నల్లగొండ పట్టణ ఆటో కార్మికులు కన్నీటి పర్యంతమయ్యారు. సోమవారం నల్లగొండ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆటో కార్మికులు భారీ నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం తమ సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని కలెక్టర్కు సమర్పించారు.
ఉపాధిని దెబ్బతీసిన ‘మహాలక్ష్మి’ పథకం, తోడైన బైక్ టాక్సీలు..
నల్లగొండ పట్టణంలో దాదాపు 5 వేల మంది ఆటో డ్రైవర్లు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఈ వృత్తిపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం (మహాలక్ష్మి) వల్ల ఇప్పటికే తమ ఆదాయం సగానికి పైగా పడిపోయిందని డ్రైవర్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ దెబ్బ నుంచి కోలుకోకముందే.. పట్టణంలో చట్టవిరుద్ధంగా నడుస్తున్న రాపిడో, ఓల్గా వంటి బైక్ టాక్సీల కారణంగా ఆటోలకు వచ్చే అరకొర ప్రయాణికులు కూడా తగ్గిపోయారని వాపోయారు. పెరిగిన ఇంధన ధరలు, వాహన విడిభాగాల ఖర్చులు, ఇన్సూరెన్స్ భారంతో తాము తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయామని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఆటో జేఏసీ ప్రధాన డిమాండ్లు ఇవే..
పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆటో కార్మికుల బతుకులు అగమ్యగోచరంగా మారుతాయని ఆటో జేఏసీ నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు కలెక్టర్కు పలు డిమాండ్లను విన్నవించారు. పెరిగిన జీవన వ్యయానికి అనుగుణంగా స్థానిక కనీస ఆటో ఛార్జీని రూ.30గా నిర్ణయించి, దానికి తక్షణమే అధికారిక అనుమతి ఇవ్వాలి. నిబంధనలకు విరుద్ధంగా వైట్ బోర్డు (సొంత) వాహనాలతో వాణిజ్య రవాణా సాగిస్తున్న రాపిడో, ఓల్గా వంటి బైక్ టాక్సీ యాప్స్పై కఠిన చర్యలు తీసుకోవాలి. ఉచిత బస్సు ప్రభావంతో నష్టపోయిన ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక ప్యాకేజీ లేదా సబ్సిడీలను ప్రకటించాలి.
చర్యలు తీసుకోకుంటే ఉద్యమం తప్పదు.. జేఏసీ హెచ్చరిక
రెక్కాడితే గానీ డొక్కాడని పేద కార్మికుల పొట్ట గొడుతున్న బైక్ టాక్సీలపై రవాణా శాఖ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలి. ప్రభుత్వం స్పందించి ఆటో కార్మికులను ఆదుకోకపోతే, భవిష్యత్తులో అన్ని కార్మిక సంఘాలను కలుపుకొని జిల్లా వ్యాప్తంగా భారీ ఆందోళనలు చేపడతాం..ఆటో కార్మిక ఉమ్మడి జేఏసీ నాయకులు, నల్లగొండ.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి