నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల ధర్నా
నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగుల ధర్నా
Editor Desk
పిఆర్సి, పెన్షన్ బకాయిల తక్షణ చెల్లింపుకు డిమాండ్
యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ ఉద్యోగ, గెజిటెడ్ అధికారుల, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల ఐక్య కార్యాచరణ సమితి (TGEJAC) పిలుపు మేరకు శుక్రవారం జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలు ధరించి ధర్నా నిర్వహించారు. భోజన విరామ సమయంలో చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి జిల్లా జేఏసీ చైర్మన్ మందడి ఉపేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2023 నుంచి రావలసిన రెండో పిఆర్సిని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్స్ మొత్తాన్ని ఏకకాలంలో చెల్లించాలని కోరారు. పెన్షన్ బకాయిలు అందక ఇప్పటికే 80 మంది రిటైర్డ్ ఉద్యోగులు మరణించారని ఆవేదన వ్యక్తం చేశారు.
సర్వీసులో ఉన్న ఉద్యోగుల ₹13 వేల కోట్ల పెండింగ్ బిల్లులు, అలాగే నిల్వలో ఉన్న ఐదు డీఏలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేసి ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
జేఏసీ సెక్రటరీ జనరల్ భగత్ మాట్లాడుతూ, ఉద్యోగులకు హామీ ఇచ్చిన హెల్త్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని, సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానం (ఓపిఎస్)ను అమలు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అమరేందర్ రెడ్డి, యాదయ్య, జగన్మోహన్ ప్రసాద్, శ్రీనివాస్, శ్రీకాంత్, కృష్ణ, లక్ష్మీనర్సింహారెడ్డి, శైలజ, శశికాంత్ తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి