మైసిరెడ్డిపల్లిలో కలెక్టర్ పర్యటన… పరిశుభ్రత, ఇందిరమ్మ ఇండ్లపై ఆదేశాలు
మైసిరెడ్డిపల్లిలో కలెక్టర్ పర్యటన… పరిశుభ్రత, ఇందిరమ్మ ఇండ్లపై ఆదేశాలు
స్థానికం బృందం
ప్రజా పాలన – ప్రగతి ప్రణాళికలో భాగంగా బొమ్మలరామారం మండలం మైసిరెడ్డిపల్లి గ్రామంలో శుక్రవారం జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి పర్యటించారు. గ్రామపంచాయతీ కార్యాలయాన్ని పరిశీలించిన అనంతరం గ్రామంలో చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమాలను పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామంలో మురికి కాలువలను శుభ్రం చేసి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. పరిశుభ్రత, పారిశుధ్య కార్యక్రమాలకు అన్ని గ్రామాలు ప్రాధాన్యతనిచ్చి విజయవంతం చేయాలని పేర్కొన్నారు.
అనంతరం గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల పనులను పరిశీలించారు. వివిధ దశల్లో ఉన్న ఇండ్లను త్వరగా పూర్తి చేసి ఉగాది పండుగ నాటికి గృహప్రవేశాలు చేయాలని లబ్ధిదారులకు సూచించారు.
తరువాత గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసి విద్యార్థులతో ముచ్చటించారు. ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారని, వారు ఏ తరగతుల్లో చదువుతున్నారో తెలుసుకున్నారు.
అంగన్వాడీ కేంద్రాన్ని కూడా పరిశీలించిన కలెక్టర్ రోజూ ఎంతమంది పిల్లలు హాజరవుతున్నారని, గర్భిణీలు, బాలింతలు ఎంతమంది ఉన్నారని అడిగి వివరాలు తెలుసుకున్నారు. గర్భిణీ స్త్రీలు అంగన్వాడీ కేంద్రంలో ప్రతిరోజూ ఆహారం తీసుకుంటున్నారా, ప్రతి నెల ఆరోగ్య పరీక్షలు చేయించుకుంటున్నారా అని ఆరా తీశారు.
ఈ సందర్భంగా అంగన్వాడీ కేంద్రంలో ఉన్న ఓ చిన్నారికి కలెక్టర్ అన్నప్రాసన నిర్వహించారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి