మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: డీఈవో కందుల సత్యనారాయణ
మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలి: డీఈవో కందుల సత్యనారాయణ
స్థానికం బృందం
మాదకద్రవ్యాల వినియోగంతో అనేక అనర్థాలు చోటుచేసుకుంటాయని, విద్యార్థులు మరియు యువత వాటికి పూర్తిగా దూరంగా ఉండాలని జిల్లా విద్యాశాఖ అధికారి కందుల సత్యనారాయణ పిలుపునిచ్చారు.
మంగళవారం బీచ్ మహల్ ఉన్నత పాఠశాలలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో మాదకద్రవ్యాల నివారణకు ఏర్పాటు చేసిన ప్రహరీ క్లబ్ ఉపాధ్యాయులు, విద్యార్థుల శిక్షణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మాదకద్రవ్యాల వల్ల వ్యక్తులే కాకుండా కుటుంబాలు కూడా నాశనమై రోడ్డున పడే పరిస్థితి వస్తుందని తెలిపారు.
మాదకద్రవ్యాల ద్వారా కలిగే తాత్కాలిక ఆనందం కంటే జీవితంలో విజయాన్ని సాధించడం ద్వారా లభించే ఆనందం ఎంతో విలువైనదని అన్నారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకొని ముందుకు సాగాలని సూచించారు. చెడు అలవాట్లు ఉన్న వారితో దూరంగా ఉంటే జీవితం మరింత మంచిగా ఉంటుందని పేర్కొన్నారు. ఇంట్లో తల్లిదండ్రుల మాట, పాఠశాలలో ఉపాధ్యాయుల మాట వింటూ జీవితాన్ని సక్రమంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. పరీక్షలపై భయాన్ని విడిచి పట్టుదలతో చదవాలని విద్యార్థులకు సూచించారు.
విద్యార్థులు జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలంటే మంచీ చెడూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలని జిల్లా కమ్యూనిటీ మొబిలైజేషన్ అధికారి పెసరు లింగారెడ్డి అన్నారు. విద్యార్థి తీసుకునే నిర్ణయంతోనే భవిష్యత్ ముడిపడి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న ఉపాధ్యాయులు, విద్యార్థులతో మాదకద్రవ్యాల నిరోధక ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఇంచార్జి ప్రధానోపాధ్యాయులు రామచంద్రం, షీ టీం సభ్యులు వరలక్ష్మి, రిసోర్స్ టీచర్లు ఎం. అనిత, జి. రమేష్, సైదులు తదితరులు పాల్గొన్నారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి