కొయ్యదొర వేషధారణలో డ్రగ్స్పై వినూత్న అవగాహన
కొయ్యదొర వేషధారణలో డ్రగ్స్పై వినూత్న అవగాహన
K.RAVI
మాదకద్రవ్యాలు, గంజాయి వినియోగంపై యువతకు అవగాహన కల్పించేందుకు కొయ్యదొర వేషధారణలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. సూర్యాపేట జిల్లా మద్దిరాల మండలం జెడ్ పి హెచ్ ఎస్ గోరంట్ల పాఠశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు, సామాజిక కార్యకర్త రాచకొండ ప్రభాకర్ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల కేంద్రంలో ఆదివారం జరిగే వారసంత సందర్భంగా ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.‘కుర్రో కుర్రో… బెజవాడ కనకదుర్గమ్మ పలుకు, సమ్మక్క సారక్క పలుకు, శ్రీశైలం మల్లన్న పలుకు, కొరివి వీరన్న పలుకు’ అంటూ కొయ్యదొర వేషధారణలో ప్రజలను ఆకట్టుకుంటూ మాదకద్రవ్యాల దుష్పరిణామాలపై చైతన్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, మాదకద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాలు సేవించడం వల్ల అనేక అనర్ధాలు జరుగుతాయని తెలిపారు. యువత వాటికి దూరంగా ఉండి లక్ష్యాన్ని ఏర్పరుచుకుని ప్రణాళికాబద్ధంగా కష్టపడి విజయం సాధించి తల్లిదండ్రులు, గురువులు, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు.
‘నో డ్రగ్స్ – సేవ్ లైఫ్’ అనే నినాదంతో కరపత్రాలు పంచుతూ మైక్ సెట్, ఫ్లెక్సీల ద్వారా డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాల ప్రమాదాలపై అవగాహన కల్పించారు. అలాగే రోడ్డు భద్రతా నియమాలు పాటించి ప్రతి ఒక్కరూ క్షేమంగా గమ్యానికి చేరుకోవాలని సూచించారు.
మరుగున పడుతున్న జానపద కళలను కాపాడటం కూడా తన బాధ్యతగా భావించి ఈ విధంగా ప్రజల్లో చైతన్యం కల్పిస్తున్నట్లు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి