కోర్టు ప్రాంగణంలో మహిళా దినోత్సవ న్యాయ అవగాహన సదస్సు
కోర్టు ప్రాంగణంలో మహిళా దినోత్సవ న్యాయ అవగాహన సదస్సు
స్థానికం బృందం
రామన్నపేట అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని రామన్నపేటలోని సీనియర్ సివిల్ కోర్టు ప్రాంగణంలో మండల లీగల్ సర్వీసెస్ కమిటీ ఆధ్వర్యంలో న్యాయ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీనియర్ సివిల్ జడ్జి జి. సబిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు తమ హక్కులు, చట్టాలపై అవగాహన కలిగి ఉండటం ఎంతో అవసరమని తెలిపారు. ముఖ్యంగా మహిళలు, బాలికల రక్షణకు సంబంధించిన పోక్సో చట్టం గురించి వివరంగా అవగాహన కల్పించారు. ఈ చట్టాలు మహిళలు, బాలికల భద్రతకు ఎంతో కీలకమని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్. శిరీష, బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం.ఏ. మజీద్ పాల్గొని మహిళల హక్కులు, చట్టపరమైన రక్షణ, సమాజంలో మహిళల పాత్రపై మాట్లాడారు. మహిళా దినోత్సవం సందర్భంగా కోర్టులో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి రెండు రోజుల పాటు క్రీడా పోటీలు నిర్వహించగా, విజేతలకు బహుమతులు అందజేశారు.
అనంతరం వలిగొండ మండలంలోని టేకులసోమారం గ్రామంలో ఉన్న సాధన మానసిక వికలాంగుల ఆశ్రమాన్ని ఆకస్మికంగా సందర్శించారు. అక్కడ కల్పిస్తున్న వసతులు, మౌలిక సదుపాయాలను పరిశీలించి నిర్వాహకులతో మాట్లాడారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలు ఆశ్రమంలో ఉన్నవారికి అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే అక్కడి మధ్యాహ్న భోజన ఏర్పాట్లను కూడా పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు, కోర్టు సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి